కరోనాకు నివారణ అంటూ తండ్రికి పురుగుల మందు తాగించాడు!

  • Published By: sreehari ,Published On : September 10, 2020 / 09:31 PM IST
కరోనాకు నివారణ అంటూ తండ్రికి పురుగుల మందు తాగించాడు!

కరోనావైరస్ నివారణ అంటూ తండ్రికి పురుగుల మందు తాగించాడో కుమారుడు.. ఆపై తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. అనీష్ రెడ్డి అనే యువకుడు కొవిడ్ నివారణ మందు తెచ్చానంటూ తండ్రితో తాగించాడు.



తనతో పాటు తల్లిదండ్రులకు మూడు గ్లాసుల్లో పురుగుల మందు కలిపాడు. తొలుత దాన్ని తండ్రికి ఇచ్చాడు. ఆ తర్వాత తాను కూడా తాగాడు. వంటగదిలో ఉన్న తల్లి బయటకు వచ్చి చూసే సరికి తండ్రికొడులిద్దరూ వాంతులు చేసుకోవడాన్ని గమనించింది. వారిని వెంటనే సోమాజీగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. పురుగుల మందును అనీష్ ఎక్కువ మోతాదులో తాగాడు. దాంతో అతడు మృతిచెందాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి రాంరెడ్డి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.



అనీష్ రెడ్డి ప్రైవేటు కంపెనీలకు భోజనం పంపిణీ చేస్తుంటాడు.. కంపెనీలు డబ్బులు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పాలయ్యాడు.. మనస్తాపంతో అనీష్ ఆత్మహత్యకు పాల్పడినట్లు అతడి తల్లి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.