Love Affair : కూతురిని ప్రేమిస్తున్నాడనే కోపంతో యువకుడి హత్య

గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక ప్రేమ వ్యవహారం యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొంది.

Love Affair : కూతురిని ప్రేమిస్తున్నాడనే కోపంతో యువకుడి హత్య

Guntur Murder

Love Affair  :  గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక ప్రేమ వ్యవహారం యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొంది. తనను కాదని కూతురు ప్రేమ పెళ్లి చేసుకుంటుందేమోననే  భయంతో కూతురు ప్రేమించిన యువకుడిని ఆమె తండ్రి దారుణంగా హత్య చేశాడు.

గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం పల్లపాడు గ్రామానికి చెందిన బండారు ఫణికృష్ణ (22) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన చావలి ఎల్లయ్య కుమార్తెను ప్రేమించాడు. ఈ విషయం ఆమె ఇంట్లో తెలిసింది. దీంతో వారు ఫణికృష్ణపై పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. అనంతరం జరిగిన పెద్దల పంచాయతీలో ఇకపై ఆమెతో దూరంగా ఉంటానని ఫణికృష్ణ ఒప్పుకున్నాడు. కొన్ని నెలల తర్వాత మళ్లీ అతడు ఆమెతో చనువుగా ఉండటం మొదలు పెట్టాడు.

Read This: Wardrob Full Of Money : ఈ బీరువాల్లో ఉన్నవి బట్టలు కాదు..కరెన్సీ కట్టలు..

ఈ సంగతి మళ్లీ ఆమె కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో ఆగ్రహంచిన యువతి తండ్రి చావలి ఎల్లయ్య ఫణికృష్ణను చంపాలని నిర్ణయించుకున్నాడు.  ఈనెల 10వ తేదీ రాత్రి ఫణికృష్ణను  తన స్నేహితులు పల్లపు సాంబయ్య, గుంజి శ్రీకాంత్‌, గుండాల నవీన్‌ సాయంతో నమ్మకంగా వంగిపురం డొంకలోని తూము వద్దకు రప్పించాడు. అక్కడ అంతకు ముందే మారణాయుధాలతో వేచివున్న చావలి ఎల్లయ్య, తాటి లింగారావు, గుమ్మా అప్పారావు, చావలి గోపి, చావలి రామకృష్ణ లు… ఫణికృష్ణ అక్కడికి రాగానే అందరూ మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేశారు.

ఫణికృష్ణ చనిపోయాడని నిర్ధారించుకున్నాక మృతదేహాన్ని దుప్పట్లో మూటకట్టి ద్విచక్ర వాహనంపై ముట్లూరు గ్రామం వైపు తీసుకెళ్లారు. అక్కడ నుంచి లేమల్లెపాడు రోడ్డులోని అప్పాపురం కాలువలో పడేశారు.  ఫణికృష్ణ   రాత్రంతా ఇంటికి రాకపోవడం,  తన మిత్రులతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లడం చూసిన అతడి నాయనమ్మ పోలమ్మ సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గతంలోనే ప్రేమ కేసు పంచాయతీ ఉండటం… ఫణికృష్ణ కుటుంబ సభ్యుల ఇచ్చిన అనుమానితులను విచారించటంతో హత్య విషయం బయట పడింది. నిందితులిచ్చిన సమాచారంతో ఫణికృష్ణ మృతదేహాన్ని పోలీసులు అప్పాపురం చానల్ వద్ద వెలికి తీసారు. మృతదేహాన్ని పోస్టు‌మార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.