భార్య అందంగా ఉందని వేధింపులు : సూసైడ్ చేసుకున్న భార్య

  • Published By: chvmurthy ,Published On : January 28, 2020 / 09:55 AM IST
భార్య అందంగా ఉందని వేధింపులు : సూసైడ్ చేసుకున్న భార్య

అందమైన యువతి భార్యగా రావాలని యువకులందరూ సాధారణంగా కలలు కంటూ ఉంటారు. అదృష్టం కొద్జి కొందరికి అది యోగిస్తుంది. అందమైన భార్య వచ్చినా ఆమెతో ఎడ్జస్ట్ కాలేని వాళ్లు, ఆమె పై అనుమానం పెంచుకుని జీవితాన్ని దుర్భరం చేసుకుంటారు కొందరు. ఎందుకంటే భార్యా రూపవతీ శత్రు: అని తెలుగులో ఒక  సామెత ఉంది.  అందమైన భార్య భర్తకి శత్రువే, తనకంటే అందమైన భార్య తన ప్రక్కన ఉంటే, యితరులు తన భార్యని వ్యామోహంతో చూస్తూ ఉంటారు కదా… దాన్ని ఏ భర్త తట్టుకోలేడు. భర్తలో అశాంతి పెరిగి పోతుంది. కర్ణాటకలో ఇదే జరిగింది. చివరికి ఏడడగులు నడిచిన భార్యను అంతమొందించాడు కట్టుకున్న భర్త. 

 

వివరాల్లోకి వెళితే బెంగుళూరు నగర జిల్లా పరిధిలోని అనేకల్ తాలూకాలోని సర్జాపుర సమీపంలోని మాదప్పన హళ్లి గ్రామంలో సుబ్రమణి అనే వ్యక్తికి రెండేళ్ళ క్రితం  హొసకోటె ప్రాంతానికి చెందిన జయశ్రీ(26) తో వివాహం అయింది. సుబ్రమణి కంటే జయశ్రీ అందంగా ఉండేది.  పెళ్లైన కొన్నాళ్లకు అతడిలోని మరో కోణం బయట పడింది. 

వివక్షతో వేధింపులు 
జయశ్రీ అందంగా ఉండటం భర్తకు నచ్చేదికాదు. ఆమె ముందు తాను తక్కువస్థాయిలో ఉన్నట్లు ఆత్మన్యూనత చెందేవాడు. దీంతో సూటిపోటి మాటలతో వేధించసాగాడు. నీవు చాలా అందంగా ఉన్నావు, నాతోపాటు బయటకి రావొద్దు అని ఒంటరిగా వెళ్ళేవాడు.  భార్యతో కలిసి ఎక్కడకూ వెళ్లేవాడు కాదు. కొత్తగా పెళ్లైన భార్యను ఎక్కడకూ తీసీకు వెళ్లేవాడు కాదు. ఒకవేళ గుడికి వెళ్లినా తాను ఒక లైన్‌లోవెళ్ళి భార్యను మరో లైన్‌లో పంపించేవాడు. ఇంట్లో మంచి చీర కట్టుకుని సాధారణంగా ముస్తాబు అయినా ఎందుకు?  ఏమిటి ? అని అనుమానంతో  ప్రశ్నించేవాడు.  నేను సినిమా తీయాలనుకుంటున్నా. నీ పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురా అని  భార్యను పీడించేవాడు. రానురాను అతడిలో అనుమానం, ఈర్ష్య పెరిగి పోసాగాయి.

తల్లితండ్రులకు మొరపెట్టుకున్న కూతురు
ఈక్రమంలో అనుమానం భర్త పెట్టే వేధింపులు తట్టుకోలేని జయశ్రీ  భర్త వ్యవహారాన్ని తల్లి తండ్రులకు చెప్పింది. దీంతోవారువచ్చి అల్లుడితో మాట్లాడి  నచ్చ చెప్పి వెళ్లిపోయారు. అయినా అతడిలో మార్పురాలేదు. అయినా భార్యను సూటి పోటి మాటలతోనూ, పుట్టింటినుంచి డబ్బు తీసుకురావాలని వేధించసాగాడు.

దీంతో జనవరి 25 శనివారం జయశ్రీ తన తల్లి తండ్రులకు ఫోన్ చేసి తాను ఇంక భర్త దగ్గర ఉండలేనని…ఆతను పెట్టే బాధలు భరించలేనని తనను పుట్టింటికి తీసుకువెళ్లిపోవాలని వేడుకుంది. ఒకటి రెండు రోజుల్లో వచ్చి తీసుకువెళతామని అప్పటి వరకు ఓపిక పట్టమని కూతురుకు ధైర్యం చెప్పారు ఆమె తల్లి తండ్రులు.

రావటం ఆలస్యం అయ్యే సరికి తనువు చాలించింది
ఇంతలో సోమవారం ఉదయానికల్లా కూతురు ఆత్మహత్య చేసుకుందని  విషాద వార్త వినాల్సి వచ్చింది. అడిగిన వెంటనే తల్లి తండ్రులు రాకపోవటం, భర్తపెట్టే వేధింపులు భరించలేని జయశ్రీ  అదివారం రాత్రి  ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  మాదప్పన హళ్లి  చేరుకున్నజయశ్రీ తల్లితండ్రులు అల్లుడు సుబ్రమణి మీద కేసు పెట్టారు. తమ కుమార్తెని భర్త సుబ్రమణి హత్య చేశాడని  వారు పిర్యాదులో పేర్కోన్నారు. కేసు నమోదు చేసుకున్న సర్జాపుర  పోలీసులు  సుబ్రమణిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.