పండక్కి పుట్టింటికి పంపించ లేదని పిల్లలతో సహా మహిళ బలవన్మరణం

పండక్కి పుట్టింటికి పంపించ లేదని పిల్లలతో సహా మహిళ బలవన్మరణం

married woman ends life with kids : క్షణికావేశంలో ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడిన ఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జవహర్ నగర్ లో చోటు చేసుకుంది. భర్త క్రిస్మస్ పండుగకు పుట్టింటికి పంపించలేదని తన ఇద్దరు పిల్లలతో సహా వివాహిత మహిళ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.

జవహర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే నాగమణి అనే వివాహిత క్రిస్మస్‌ పండగకు పుట్టింటికి వెళ్తానని భర్తను అడిగింది. పండుగ తర్వాత వెళ్దువుగాని అని అతడు భార్యకు చెప్పాడు. ఈ విషయంలో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో నాగమణి తీవ్ర మనస్తాపానికి గురైంది.

ఈ క్రమంలో ఆమె తన ఇద్దరు పిల్లలు…. ఐదేళ్ల కుమార్తె మార్వెల్ రూబీ, 8 నెలల కూతురితో కలిసి ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయింది. రాత్రి అయినా భార్యా పిల్లలు ఇంటికి తిరిగా రాకపోవటంతో ఆమె భర్త జవహర్‌ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండగా చెన్నపురం చెరువులో మూడు మృతదేహాలు ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీశారు.

మృతులను నాగమణి, ఆమె ఇద్దరు పిల్లలుగా భర్త గుర్తించాడు. వీరి మృతికి కుటుంబ కలహాలే కారణమా.. మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సంఘటనా స్థలికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరించింది.