50కిపైగా కత్తిపోట్లు.. పట్టపగలే నడిరోడ్డుపై ఎంఐఎం నేత దారుణ హత్య.. మూడేళ్లకి ప్రతీకారం
పట్టపగలు.. నడిరోడ్డు.. ఆరుగురు వ్యక్తులు.. చేతిలో వేట కొడవళ్లు.. 50కిపైగా కత్తిపోట్లు.. ఒళ్లుగగుర్పొడిచే రీతిలో ఎంఐఎం నేత దారుణ హత్య..
MIM Leader Brutal Murder : పట్టపగలు.. నడిరోడ్డు.. ఆరుగురు వ్యక్తులు.. చేతిలో వేట కొడవళ్లు.. 50కిపైగా కత్తిపోట్లు.. ఒళ్లుగగుర్పొడిచే రీతిలో నరికి నరికి చంపారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ సమీపంలోని మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం(ఏప్రిల్ 1,2021) దారుణ హత్య చోటు చేసుకుంది. ఎంఐఎం నేతను ప్రత్యర్థులు అతి కిరాతకంగా చంపడం స్థానికంగా సంచలనం రేపింది. తండ్రిని చంపిన వ్యక్తిపై పగ పెంచుకున్న అతని కుమారులు మూడేళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్నారు. పట్టపగలే నడ్డిరోడ్డుపైనే వేట కొడవళ్లతో పొడిచి చంపారు.
మృతుడి పేరు అసద్ఖాన్(45). ఎంఐఎం నేత. అసద్, అంజాద్ఖాన్ మిత్రులు. తమ స్నేహాన్ని మరింత దృఢంగా మార్చుకోవాలనుకున్న అసద్.. తన కుమార్తెను, స్నేహితుడి కుమారుడికిచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం జరిపించాడు. తర్వాత కొంతకాలానికి కూతురు, అల్లుడు మధ్య మనస్పర్థలొచ్చాయి. అమ్మాయి పుట్టింటికొచ్చేసింది. దంపతుల మధ్య గొడవలకు తన మిత్రుడే కారణమని భావించిన అసద్ అతనిపై పగ పెంచుకున్నాడు. 2018లో శాస్త్రిపురంలోని వెల్డింగ్ షాప్లో ఒంటరిగా ఉన్న అంజాద్ఖాన్పై మరో అయిదుగురితో కలిసి దాడిచేశాడు. అత్యంత దారుణంగా సుత్తితో కొట్టి హతమార్చాడు. ఈ ఘటనలో అతను అరెస్టయి, జైలుకు వెళ్లాడు. కొంతకాలం క్రితం జైలు నుంచి బయటికొచ్చాడు. అతనిపై పోలీసులు రౌడీ షీట్ తెరిచారు.
కాగా, అంజాద్ కొడుకులు ప్రతీకారంతో రగిలిపోయారు. తండ్రిని చంపిన వ్యక్తిపై పగ తీర్చుకోవాలనుకున్నారు. మూడేళ్లుగా హతుని కుమారులు అదునుకోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పాతబస్తీ తీగలకుంట అచ్చిరెడ్డినగర్లో ఉండే అసద్ఖాన్, మిత్రుడు బాబాతో కలిసి గురువారం మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో బైక్ పై మైలార్దేవుపల్లి ఠాణా పరిధిలోని నైస్హోటల్ మీదుగా వట్టెపల్లి వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో అతివేగంగా ఎదురుగా(రాంగ్రూట్) దూసుకొచ్చిన ఆటో వారి బైక్ను ఢీకొట్టింది.
తర్వాత ఆటో నుంచి ఆరుగురు వేట కొడవళ్లతో కిందకు దిగారు. బైక్పై నుంచి కింద పడిన అసద్ఖాన్పై వేట కొడవళ్లతో దాడిచేశారు. విచక్షణ రహితంగా పొడిచారు. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత వేట కొడవళ్లను అక్కడే పడేసి పరారయ్యారు. అందరూ చూస్తుండగానే జరిగిన ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. మృతదేహంపై 50కి పైగా కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అంజాద్ఖాన్ కొడుకులే మరికొందరితో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.