Moinabad Farm House Case : ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు .. జగ్గుస్వామిపై సిట్ లుకౌట్ నోటీసులు జారీ
మొయినాబాద్ టీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రలోభాల కేసు దర్యాప్తులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న కేరళకు చెందిన జగ్గు స్వామిని వాంటెడ్ వ్యక్తిగా పేర్కొంటూ మొయినాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు.
Moinabad Farm House Case : మొయినాబాద్ టీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రలోభాల కేసు దర్యాప్తులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న కేరళకు చెందిన జగ్గు స్వామిని వాంటెడ్ వ్యక్తిగా పేర్కొంటూ మొయినాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు.దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులను అలర్ట్ చేశారు తెలంగాణ పోలీసులు. బీఎల్ సంతోష్, తుషార్,జగ్గుస్వామిలను పోలీసులు వాంటెడ్ లిస్టులో చేర్చారు.
డాక్టర్ కొట్టిలిల్ నారాయణ్ జగ్గు అలియాస్ జగ్గు స్వామి కేరళలోని ఎర్నాకులంలోని అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో డాక్టర్గా గుర్తింపు పొందారు.మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో నలుగురు TRS ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసారనే వార్తలు పెను సంచలనం కలిగించాయి. ఈ విషయం అంతకంతకు ముదిరింది. బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఈ క్రమంలో సిట్ ఏర్పాటుతో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు దర్యాప్తుని అధికారులు ముమ్మరం చేశారు. టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు భారీ మొత్తంలో డబ్బు ఆశ చూపి బీజేపీలోకి చేరేలా ఫిరాయింపజేసేందుకు జరిగిన కుట్రలో కీలక పాత్ర పోషించారు అని జగ్గు స్వామికి జారీ చేసిన నోటీసు లో సిట్ అధికారులు పేర్కొన్నారు.
జగ్గు స్వామి తన నివాసం, పని స్థలం నుండి పరారీలో ఉన్నాడని పేర్కొంటూ, భారతదేశం అంతటా అన్ని పోలీసు యూనిట్లకు, పోలీసు స్టేషన్లకు లుక్ అవుట్ నోటీసును తెలంగాణ పోలీసులు పంపారు. అతను కనిపించినా..అతనికి సంబంధించిన విషయాలేమైనా తెలిసినా హైదరాబాద్ సిటీ కంట్రోల్ రూమ్కు ఆధారాలను అందించాలని నోటీసు కోరింది. ఏసీపీ రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్ డీసీపీ, మొయినాబాద్ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన అన్ని సంస్థల కాంటాక్ట్ నంబర్లను కూడా అందించారు.
ఈ కేసుకు సంబంధించి విచారణ అధికారిగా ఉన్న రాజేంద్రనగర్ ఏసీపీ నోటీసులు జారీ చేశారు. కాగా తనకు తాను డాక్టర్ గా ప్రచారం చేసుకుంటున్న జగ్గు స్వామి అసలు డాక్టరే కాదనే ఆరోపణలు ఉన్నాయి. కేరళలోని ఎర్నాకులంలో ఉండే జగ్గుస్వామి అమృత మెడికల్ ఇన్స్టిట్యూట్లోనే ఉంటాడని, అక్కడ ఆయన ఇప్పుడు కీలక వ్యక్తిగా ఉన్నారని చెబుతున్నారు. తనకు తాను ఆయన డాక్టర్ అని చెప్పుకుంటారని, కానీ, ఎక్కడ వైద్య విద్య అభ్యసించలేదనే ఆరోపణలు వస్తున్నాయి.