పోయిన పెన్ డ్రైవ్ లో ఆ ఫోటోలు–రూ.5 లక్షలు డిమాండ్ చేస్తున్న నిందితుడు
MP: Bhopal couple blackmailed over intimate photos in lost pen drive : తోటి విద్యార్దులతో కలిసి ఢిల్లీ ట్రిప్ కు వెళ్లిన లా చదివే యువతి తన పెన్ డ్రైవ్ పోగోట్టుకుంది. అందులో ఆమె తన స్నేహితుడితో సన్నిహితంగా ఉన్న పోటోలు ఉన్నాయి. ఆ పెన్ డ్రైవ్ దొరికిన వ్యక్తి ఆ యువతిని, ఆమె బాయ్ ఫ్రెండ్ ను డబ్బులు డిమాండ్ చేయటం మొదలెట్టాడు. విసిగిపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన లా విద్యార్ధిని (21) తోటి విద్యార్ధులతో కలిసి జనవరి4న మధుర, ఢిల్లీ యాత్రకు వెళ్లారు. యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో మధురలో ఒక రెస్టారెంట్ వద్ద భోజనానికి ఆగారు. రెస్టారెంట్ లో డబ్బులు చెల్లించేటప్పుడు తన హ్యాండ్ బ్యాగ్ లోని పెన్ డ్రైవ్ అక్కడ పడిపోయింది.
అది చూసుకోని యువతి తిరిగి భోపాల్ చేరుకుంది. జనవరి 15న ఆమెకు ఒక అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ తో సన్నిహితంగా ఉన్నఫోటోలు నాదగ్గర ఉన్నాయి. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉండాలంటే రూ. 5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అతడి మాటలు విని ఆమె షాక్ కు గురైంది.
తన పెన్ డ్రైవ్ లో ఉండే ఫోటోలు బయటకు ఎలా వచ్చాయా ? అని పెన్ డ్రైవ్ కోసం వెతికింది. అది కనపడలేదు. దాంతో ఆమెకు పరిస్ధితి అర్ధం అయిపోయింది. పోగొట్టుకున్న పెన్ డ్రైవ్ లో ఫోటోలతో తనను బ్లాక్ మెయిల్ చేయటం ప్రారంభించాడని అర్ధం చేసుకుంది. ఆ పెన్ డ్రైవ్ లోనే ఆమె ఫోన్ నెంబర్ కూడా అందులో ఉండటంతో నిందితుడు ఆమె నెంబర్ కు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయటం మొదలెట్టాడు.
ఆమె ప్రియుడి నెంబరు కూడా తీసుకుని, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని అతడ్ని కూడా బెదిరించటం మొదలెట్టాడు. అపరిచిత నిందితుడి వేధింపులు భరించలేని మిత్రులిద్దరూ కలిసి బాగ్ సెవానియా పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. నిందితుడి ఫోన్ నెంబర్ ఆధారంగా అతడ్ని పట్టుకునేందుకు గాలింపు చేపట్టినట్లు ఎస్సై సంజీవ్ చౌక్సే తెలిపారు.