కారులో మంటలు..ఎన్సీపీ నేత సజీవదహనం
NCP leader burnt alive మహారాష్ట్రలో దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే కారుతో సహా ఎన్సీపీ నాయకుడు సంజయ్ షిండే సజీవ దహనం అయ్యారు. బుధవారం సాయంత్రం నాసిక్ లోని పింపల్గావ్ బస్వంట్ టోల్ ప్లాజా సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారులో షాట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
స్థానికుల సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, అప్పటికే సంజయ్ షిండే ప్రాణాలు కోల్పోయారు. కారులో శానిటైజర్లు కూడా ఉండటంతో మంటలు మరింత వేగంగా అంటుకున్నాయని స్థానికులు తెలిపారు.
కారులో మంటలు రావడంతో సెంట్రల్ లాకింగ్ మెకానిజమ్ యాక్టివేట్ అయి డోర్స్ జామ్ అయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ కారణంగానే సంజయ్ షిండే కారు నుంచి బయటకు రాలేక సజీవదహనం అయ్యారని పోలీసులు తెలిపారు.మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
కాగా.. సంజయ్ షిండే ప్రసిద్ద ద్రాక్ష ఎగుమతిదారునిగా మంచి పేరుగడించారు. ఎన్సీపీనేతగా రాజకీయాల్లోనూ రాణిస్తున్నాడు. నాసిక్ జిల్లాలో ఆయనకు వైన్ తయారీ కేంద్రం ఉంది. తన పండ్ల తోట కోసం పురుగు మందులను కొనేందుకు ఆయన పింపల్ గావ్ వెళ్లే సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.