వరంగల్ ప్రేమోన్మాది దాడి ఘటనలో కొత్త కోణాలు : మాట్లాడాలని పిలిచి అత్యాచారం చేసి హత్య
వరంగల్ ప్రేమోన్మాది దాడి ఘటనలో కొత్తకోణాలు బయటకొస్తున్నాయి. ఇద్దరి మధ్య గొడవ జరిగి హత్య జరిగినట్లు అనుమానించగా ఇప్పుడు కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. హత్యకు ముందే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆరు నెలల ముందే ఇందుకు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పథకం ప్రకారమే రామ్నగర్లోని పోలీసు అధికారి ఇంటిని అద్దెకు తీసుకున్నాడు.
అద్దెకు దిగాడు కానీ ఇంట్లో పెద్దగా వస్తువులు కూడా ఏమీ లేవు. మృతురాలు తన స్నేహితులతో చనువుగా ఉంటోందని షాహిద్ అనుమానించాడు. అంతేకాకుండా సంక్రాంతి తర్వాత అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్నాడు. దీంతో ఎలాగైనా చంపాలని ప్లాన్ చేసుకున్నాడు. మాట్లాడదామని రూమ్కు పిలిచి అత్యాచారం చేసి హత్య చేశాడు. రక్తపు మరకలు ఉన్న బట్టలతోనే కాజీపేటలోని ఇంటికి వెళ్లాడు. నేరుగా సెంట్రల్ జైలుకు వెళ్లి లొంగిపోయేందుకు ప్రయత్నం చేశాడు. జైలు అధికారుల సలహాతో పోలీసులకు లొంగిపోయాడు.
హన్మకొండ రామ్నగర్లో ఉన్మాది షాహీద్ రెచ్చిపోయాడు. యువతిని గొంతుకోసి చంపాడు. హన్మకొండ రాంనగర్కు చెందిన షాహిద్.. స్థానికంగా ఉన్న ఓ మటన్ షాప్లో పనిచేస్తున్నాడు. లష్కర్ సింగారానికి చెందిన ఎంబీఏ విద్యార్థిని హారతితో అతనికి పరిచయం ఉంది. ఈ క్రమంలోనే నిన్న(జనవరి 10,2020) రాంనగర్లోని షాహిద్ గదికి యువతి వెళ్లింది. అక్కడ వారిద్దరికి ఏదో విషయంలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది.
మాటామాటా పెరగడంతో నిందితుడు హారతిపై దారుణంగా దాడి చేశాడు. ఆమె గొంతు కోసి అక్కడ నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన యువతి అక్కడికక్కడే చనిపోయింది. హత్య చేసిన తరువాత నిందితుడు జడ్జి ఎదుట లొంగిపోయాడు. పోలీసులకు సమాచారం అందించడంతో షాహిద్ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబందించి పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటనా స్థలంలో మృతురాలి సెల్ఫోన్, చెప్పులు, కళ్లజోళ్లు స్వాధీనం చేసుకున్నారు.