పెళ్లైన ఐదు రోజులకే నవ వధువు ఆత్మహత్య

  • Published By: murthy ,Published On : July 14, 2020 / 03:32 PM IST
పెళ్లైన ఐదు రోజులకే నవ వధువు ఆత్మహత్య

పచ్చని పందిట్లో పెళ్లైన 5వరోజే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో జరిగింది. ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో ఒక్కటైన ఆ జంటలో వధువు ఆత్మహత్య చేసుకునే సరికి ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగి పోయింది.

తిరుపూర్ జిల్లా తారాపురం మారుతీ నగర్ కు చెందిన రాజ్ కుమార్ కుమార్తె దేవి(20) సమీప బంధువు, అమరావతికి చెందిన సెల్వరాజ్(29) ను ప్రేమించింది. ఇరువురు ప్రేమికులు ఇంట్లో తమ ప్రేమ సంగతి చెప్పి ఒప్పించారు. పెద్దల అంగీకారంతో జులై 8న వీరి వివాహం జరిగింది.

శనివారం జులై 11న దేవి ఇంటికి కొత్త దంపతులు ఇద్దరూ విందు భోజనానికి వచ్చారు. ఆరోజు అందరూ సంతోషంగా గడిపారు. మరునాడు ఆదివారం మధ్యాహ్నం అందరూ భోజనాలు చేసి ఇంటి వెలుపల మాట్లాడుకుంటున్నారు. ఈలోగా ఇంట్లోకి వెళ్లిన దేవి తలుపులు వేసుకుంది.

చాలా సమయం గడిచినా బయటకు రాకపోయే సరికి ..తలుపు తట్టి చూశారు. ఎంతసేపటికి సమాధానం రాకపోవటంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూశారు. అక్కడ ఇంటి దూలానికి దేవి చీరతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆమెను తారాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సెల్వరాజ్, దేవి తల్లిదండ్రులు బోరున విలపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.