దుష్టశక్తులు పారదోలతానని, వివాహితపై అత్యాచారం

  • Published By: naveen ,Published On : July 2, 2020 / 04:22 PM IST
దుష్టశక్తులు పారదోలతానని, వివాహితపై అత్యాచారం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో దారుణం జరిగింది. దుష్ట శక్తులు పారదోలతానని చెప్పి ఓ మంత్రగాడు వివాహితపై(20) అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బాధితురాలిని, ఆమె భర్తను బెదిరించాడు. బాధితురాలి భర్త ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

భార్య దేహంలోకి దుష్ట శక్తులు చేరాయని అనుమానం:
నోయిడాలో నివాసం ఉండే ఓ వ్యక్తికి ఫిబ్రవరిలో పెళ్లి అయ్యింది. పెళ్లి అయిన తర్వాతి రోజు నుంచి ఇంట్లో పరిస్థితులు బాగోలేవు. ఇంట్లో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. అతడికి తన భార్యపై అనుమానం వచ్చింది. ఆమెలోకి దుష్ట శక్తులు ప్రవేశించాయని దాని వల్లే ఇదంతా జరుగుతోందని అనుమానించాడు. ఈ క్రమంలో మంత్రగాడి దగ్గరికి తన భార్యను తీసుకెళ్లి చూపించాలని నిర్ణయించాడు.

ఆ వెంటనే ఆ వ్యక్తి స్థానికంగా ఉండే మంత్రగాడిని కలిశాడు. జరిగిన విషయం చెప్పాడు. ఆ మంత్రగాడు ఆ వ్యక్తి ఇంటికి వెళ్లాడు. ఇళ్లంతా తిరిగాడు. ఆ వ్యక్తి భార్య శరీరంలోకి దుష్ట శక్తులు ప్రవేశించాయని చెప్పాడు. దాని వల్లే ఇలా జరుగుతోందన్నాడు. ఆ దుష్ట శక్తిని తాను తొలగిస్తానని నమ్మించాడు. ఆ తర్వాత నువ్వు, నీ భార్య నేను చెప్పిన చోటుకి రావాలన్నాడు. దానికి ఆ వ్యక్తి సరే అన్నాడు. అలాగే మంత్రగాడు రూ.5వేలు కూడా తీసుకున్నాడు.

మత్తు మందు ఇచ్చి వివాహితపై అత్యాచారం:
మంత్రగాడి మాయమాటలు నమ్మిన ఆ వ్యక్తి తన భార్యను తీసుకుని అతడికి దగ్గరికి వెళ్లాడు. అక్కడ ఏదో పదార్ధాన్ని ఆ ఇద్దరికి మంత్రగాడు ఇచ్చాడు. అది తిన్న వెంటనే భార్య, భర్త స్పృహ కోల్పోయారు. ఇదే అదనుగా ఆ మంత్రగాడు వివాహితపై అత్యాచారం చేశాడు. కాసేపటికి ఇద్దరూ స్పృహ లోకి వచ్చారు. జరిగిన ఘోరం వారికి అర్థమైంది. వారు నోరు తెరిచేలోపే, మంత్రగాడు వారిని బెదిరించాడు.

ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తా అన్నాడు. అయితే ధైర్యం చేసిన భర్త పోలీసులను ఆశ్రయించాడు. ఆ మంత్రగాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు మంత్రగాడిని అరెస్ట్ చేశారు. దుష్ట శక్తులు, దెయ్యాలు, భూతాలు మూఢ నమ్మకాలే అని పోలీసులు చెప్పారు. అలాంటివి నమ్మితే ఇలానే మోసపోవాల్సి ఉంటుందన్నారు.

Read:స్వీట్ల ఆశ చూపి పొలాల్లోకి తీసుకెళ్లి 9ఏళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారం