Gangster Hyder : 60 ఏళ్ల గ్యాంగ్ స్టర్ ను జైలు నుంచి తప్పించిన 19 ఏళ్ల గర్ల్ ఫ్రెండ్

ఒడిషా లోని కటక్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తూ... జైలు నుంచి తప్పించుకుని, తెలంగాణ,జహీరాబాద్ రూరల్ పరిధిలోని హుత్నూర్ లో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కిన గ్యాంగ్ స్టర్ హైదర్ (60) కేసులో కొత్తట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి.

Gangster Hyder : 60 ఏళ్ల గ్యాంగ్ స్టర్ ను జైలు నుంచి తప్పించిన 19 ఏళ్ల గర్ల్ ఫ్రెండ్

Gangster Hyder Escape case

Odisha Gangster Hyder Escape case : ఒడిషా లోని కటక్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తూ… జైలు నుంచి తప్పించుకుని, తెలంగాణ,జహీరాబాద్ రూరల్ పరిధిలోని హుత్నూర్ లో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కిన గ్యాంగ్ స్టర్ హైదర్ (60) కేసులో కొత్తట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. హైదర్ జైలు నుంచి తప్పించుకోటానికి అతని 19 ఏళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో పాటు కానిస్టేబుల్, జైలు వార్డర్ లు కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. వీరిని గతవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి సహకరించిన మరో ఇద్దరు యువతులు, హైదరాబాద్, జహీరాబాద్‌ సమీపంలోని హత్నూర్‌లకు చెందిన మరో ఇద్దరు చిరు వ్యాపారులకు త్వరలో నోటీసులు ఇచ్చి పోలీసులు విచారణ జరపనున్నారు.

ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్, కటక్, పూరీ జిల్లాల్లో నమోదైన హత్య, హత్యాయత్నం, బెదిరింపులు, దోపిడీ కేసుల్లో హైదర్‌ నిందితుడు. కోర్టులో కొన్ని కేసుల్లో నేరం నిరూపించబడటంతో దోషిగా మారాడు. రెండు హత్య కేసుల్లో పడిన జీవితఖైదును హైదర్ ఏకకాలంలో అనుభవిస్తున్నాడు. హైదర్ 2017 వరకు భువనేశ్వర్‌లోని ఝార్పాడ జైల్లో ఉండేవాడు. అక్కడ భద్రత కారణాల నేపథ్యంలో 2018లో సబల్‌పూర్‌ జైలుకు మార్చి కట్టుదిట్టమైన భద్రత మధ్య అనునిత్యం పహారాలో ఉంచారు.

కటక్‌ ప్రాంతానికి చెందిన అర్చన ఫరీద (19) అనే యువతి ఇంటర్‌ చదువుతూ మధ్యలో ఆపేసింది. తల్లి దండ్రులు లేని ఈమె హైదర్‌, ఝూర్పాడ జైల్లో ఉండగా ములాఖత్‌లో కలిసి తనకు ఓ ఉద్యోగం ఇప్పించాలని కోరింది. ఈమె పట్ల ఆకర్షితుడైన హైదర్‌ తన వద్దే ఉద్యోగం చేయాలని కోరాడు. తాను జైలు నుంచి ఇచ్చే ఆదేశాలను బయట ఉన్న అనుచరుల ద్వారా అమలు చేయించాలని సూచించాడు. దీనికి అంగీకరించిన అర్చన దాదాపు ఏడాది కాలంలో హైదర్‌ కోసం పని చేస్తూ ప్రధాన అనుచరురాలిగా మారిపోయింది. నిత్యం జైలుకు వెళ్లి కలుస్తూ అతడి సూచనలు తీసుకుని బయట ఉన్న అనుచరుల ద్వారా అమలు చేసేది.

జైల్లో ఉన్న హైదర్‌ను ఈమెతో పాటు మరో ఇద్దరు యువతులు కూడా తరచూ కలిసినట్లు కటక్‌ పోలీసులు ములాఖత్‌ రిజిస్టర్‌ ద్వారా గుర్తించారు. వారి వివరాలు ఆరా తీయగా అర్చనకు స్నేహితులుగా తేలింది. వీరు కూడా హైదర్‌తో సన్నిహితంగానే పని చేశారని అనుమానిస్తున్నారు. గడిచిన కొన్ని రోజుల నుంచి హైదర్‌ గ్యాంగ్‌ భువనేశ్వర్‌ ప్రాంతానికి చెందిన కొందరు వ్యాపారుల్ని టార్గెట్‌గా చేసుకుంది.

వారిని బెదిరించి డబ్బు వసూలు చేయాలని అర్చన ద్వారా హైదర్‌ ఆదేశాలు జారీ చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అతడి అనుచరులు సఫలీకృతం కాలేకపోయారు. దీంతో తానే స్వయంగా రంగంలోకి దిగుతానంటూ అర్చనతో చెప్పిన హైదర్‌ ఆస్పత్రి డ్రామాకు తెరలేపాడు. తనకు కిడ్నీ సమస్య వచ్చినట్లు సబల్‌పూర్‌ జైలు అధికారులకు చెప్పిన హైదర్‌ చికిత్స కోసమంటూ మార్చి 23న కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్‌ కాలేజీ ఆస్పతిలో చేర్చేలా చేశాడు.

అక్కడ తనకు కాపలాగా ఉన్న కానిస్టేబుల్‌ మహ్మద్‌ మోసిన్, జైలు వార్డర్‌ శివనారాయణ్‌ నంద లను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. తన అనుచరుడు యాకూబ్, కుటుంబీకులతో వీరికి నగదు, ఇతర బహుమతులు అందించాడు. అర్చనను తరచూ తన వార్డుకు పిలిపించుకుని ఆమె ఫోన్‌ వినియోగిస్తూ టార్గెట్‌ చేసిన వారిని బెదిరించాడు. ఈ విషయం తెలిసినా మోసిన్, నందలు పట్టించుకోకుండా సహకరించారు. అతడు పారిపోవడానికి వీరిద్దరి నిర్లక్ష్యమే కారణమని పోలీసులు గుర్తించారు.

హైదర్‌ అరెస్టుకు కొనసాగింపుగా అర్చన, మోసిన్, నందలను అరెస్టు చేశారు. అర్చన స్నేహితురాళ్లు ఇద్దరి పాత్రలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. హైదరాబాద్, జహీరాబాద్‌లలో హైదర్‌ తల దాచుకోవడానికి సహకరించిన ఇద్దరు చిరు వ్యాపారులకూ నోటీసులు జారీ చేసి వారిని విచారించాలని కటక్‌ పోలీసులు నిర్ణయించారు.