నాన్నా, నన్ను క్షమించు…ట్రాన్స్ జెండర్ అని ఎగతాళి చేస్తున్నారని బాలుడు ఆత్మహత్య
తోటి విద్యార్థులందరూ తనను హిజ్రా లేదా ట్రాన్స్ జెండర్ అని ఎగతాళి చేస్తున్నారని 16ఏళ్ళ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం రాత్రి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. తనపై తరచూ చేస్తున్న క్రూరమైన వ్యాఖ్యలతో నిరంతరం పోరాడలేక బాలుడు తన ఇంట్లోని ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చావుకు గల కారణాలు వివరిస్తూ రాసిన సూసైడ్ నోట్ బాలుడి గదిలో లభ్యమైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బరేలీలోని సుభాష్ నగర్కు చెందిన పదహారేళ్ల బాలుడు 10వ తరగతి చదువుతున్నాడు. సోమవారం అతని తండ్రి మార్కెట్ వెళ్లగా, సోదరుడు మరో గదిలో చదువుకుంటున్నాడు. ఈ సమయంలో అతను గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలంలో పోలీసులకు ఆత్మహత్య లేఖ లభించింది. అందులో..నాన్న.. నేను మంచి కొడుకును కానందుకు నన్ను క్షమించు. నీలాగా నేను సంపాదించలేను. నా ముఖం అమ్మాయిలా కనిపించడమే కాక, అమ్మాయి లక్షణాలే ఎక్కువగా ఉన్నాయి. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు.
నన్ను హిజ్రా అంటూ ఎగతాళి చేస్తున్నారు. నేను హిజ్రానా అని నాకూ అనుమానమేస్తోంది. నా వల్ల నీ జీవితం చీకటిమయం కాకూడదు. అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్నా. మరో జన్మంటూ ఉంటే నేను అమ్మాయిగా పుట్టాలని నన్ను ఆశీర్వదించు. మన కుటుంబంలో ఆడపిల్ల పుడితే నేనే మళ్లీ జన్మించానని భావించండి అని రాసుకొచ్చాడు.
ఈ ఘటనపై బాధితుడి తండ్రి మాట్లాడుతూ.. నా కొడుకు మామూలుగానే ఉండేవాడు. కానీ కొంతమంది వాడిని తప్పుగా అర్తం చేసుకుని కించపరుస్తూ మాట్లాడేవారు. అతడు తన తమ్ముడిని బాగా చూసుకునేవాడు. నేను లేనప్పుడు వంట కూడా చేసేవాడు. కొన్నిసార్లు మాత్రం స్త్రీలలాగా మేకప్ వేసుకుని డ్యాన్స్ చేసేవాడు” అని పేర్కొన్నాడు. సుశాంత్ సింగ్ రాజ్పుత్లాగా తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడని మృతుడి సోదరుడు తెలిపాడు.