MP Adhir Ranjan Chaudhary : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై వివాదాస్పద వ్యాఖ్యలు.. కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరిపై కేసు నమోదు
కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపత్ని అని పేర్కొన్నందుకు ఆయనపై కేసు నమోదైంది. బీజేపీ కార్యకర్తల ఫిర్యాదుతో మధ్యప్రదేశ్ పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
MP Adhir Ranjan Chaudhary : కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపత్ని అని పేర్కొన్నందుకు ఆయనపై కేసు నమోదైంది. బీజేపీ కార్యకర్తల ఫిర్యాదుతో మధ్యప్రదేశ్ పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన జాతీయ మహిళా కమిషన్… అధిర్ రంజన్ చౌదరికి నోటీసులు జారీ చేసింది. తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని, లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.
ఆగస్టు 3వ తేదీ ఉదయం 11.30 గంటలకు విచారణ ఉంటుందని వెల్లడించింది. NCWతో పాటు 13 రాష్ట్ర మహిళా కమిషన్లు కూడా ఎంపీ అధిర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి కూడా జాతీయ మహిళా కమిషన్ లేఖ రాసింది. ఈ వివాదంలో జోక్యం చేసుకోవాలని, అనుచిత వ్యాఖ్యలు చేసిన అధిర్ రంజన్ చౌదరిపై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని రాష్ట్రపత్నిగా పేర్కొన్నందుకు తన తప్పును అంగీకరిస్తున్నానన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి. తాను రాష్ట్రపతికి క్షమాపణలు చెబుతానని అన్నారు. తాను బెంగాలీ వాడినని, హిందీ అలవాటు లేదని తెలిపారు. రాష్ట్రపతిని తాను స్వయంగా కలిసి క్షమించాలని కోరుతానని అన్నారు. అయితే.. ఈ కపటవాదులకు క్షమాపణ చెప్పబోనని ఆయనను విమర్శించేవారిని ఉద్దేశించి అన్నారు.