Ganja Fields : విశాఖ మన్యంలో 49 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం
మాదక ద్రవ్యాల రవాణా, వినియోగంపై ఏపీ, తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
Ganja Fields : మాదక ద్రవ్యాల రవాణా, వినియోగంపై ఏపీ, తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గుంటూరులో భారీ ఎత్తున పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకుంటే…. ఉత్తరాంధ్రలో పోలీసులు ఆపరేషన్ పరివర్తన పేరుతో గంజాయి తోటలను ధ్వంసం చేస్తున్నారు. తెలంగాణలో వరంగల్ పోలీసు కమీషనరేట్ పరిధిలో 64 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విశాఖ జిల్లా ఏజెన్సీ ఏరియాలో ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా గూడెం కొత్తవీధి మండలం, లక్కవరపు పేట పంచాయతీ పరిధిలో నేరెళ్లబంధ గ్రామంలో ఈరోజు ఆపరేషన్ పరివర్తన చేపట్టారు. గ్రామస్తులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం గ్రామ సమీపంలో 49 ఏకరాల్లో సాగు చేస్తున్న గంజాయి పంటలను ధ్వంసం చేసారు.
తాజాగా అందిన సమాచారం మేరకు గుంటూరు జిల్లా పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ లో ఆదివారం సాయంత్రం రైలులో అక్రమంగా తరలిస్తున్న 16 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు…. తెలంగాణలో కూడా గంజాయి రవాణా పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఒడిషా నుండి మహరాష్ట్రకు గంజాయి స్మగ్లింగుకు పాల్పతున్న నలుగురు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను టాస్క్ఫోర్స్, రాయపర్తి పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్టు చేయగా, మరోక నిందితుడు ప్రస్తుతం పరారీలో వున్నాడు.
Also Read : Murder Attack : కర్ణాటకలో చర్చి ఫాదర్ పై హత్యాయత్నం
అరెస్టు చేసిన నిందితుల నుండి పోలీసులు 6లక్షల 40వేల రూపాయల విలువగల 64కిలోల గంజాయితో పాటు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితులందరు మహరాష్ట్ర, పూణే జిల్లాకు చెందిన సంతోష్ సీతారాం కాలే, లక్షన్ సీతారాం, రాహుల్ మనోహర్, సౌరబ్ సంజయ్ కాలేగా గుర్తించడంతో పాటు కోరాపుట్ జిల్లా, ఒడిషా రాష్ట్రానికి చెందిన పవిత్ర అనే వ్యక్తి ప్రస్తుతం పరారీలో వున్నాడు.