పార్టీకి డబ్బులు ఇవ్వలేదని : తల్లిదండ్రులకు నిప్పు పెట్టిన కొడుకు

  • Published By: veegamteam ,Published On : May 16, 2019 / 11:14 AM IST
పార్టీకి డబ్బులు ఇవ్వలేదని : తల్లిదండ్రులకు నిప్పు పెట్టిన కొడుకు

ప్రకాశం జిల్లా మార్కాపురలో దారుణం. బర్త్ డే పార్టీకి డబ్బులు ఇవ్వలేదన్న కోపం ఓ కొడుకు చేసిన నిర్వాకం సంచలనం అయ్యింది. తల్లిదండ్రులపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం మార్కాపురం ఆస్పత్రికి తరలించారు.

తండ్రి గాలయ్య, తల్లి లక్ష్మీ దంపతులు. కొడుకు ప్రసాద్ తో కలిసి మార్కాపురంలోని ఎస్సీ బీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. ప్రసాద్.. స్థానిక కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. తన బర్త్ డే పార్టీకి డబ్బులు ఇవ్వాలని ప్రసాద్ గురువారం (మే16, 2019)న తల్లిదండ్రులను ఒత్తిడి చేశాడు. డబ్బులు ఇస్తేనే పార్టీ చేసుకుంటానని.. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. పెట్రోల్ బంక్ నుంచి బాటిల్ లో ఏకంగా పెట్రోల్ కూడా తెచ్చుకున్నాడు. ఒంటిపై పోసుకుని చనిపోతాను అంటూ బెదిరింపులకు దిగాడు.

కొడుకు పరిస్థితి చూడలేక.. నీవ్వెందుకు రా చావడం.. మేమే చస్తామని తల్లిదండ్రులు ఆ పెట్రోల్ బాటిల్ ను తీసుకుని వారిపై పోసుకున్నారు. దీంతో మీరు చస్తానన్నారు కదా.. చావండంటూ అగ్గిపుల్ల వెలిగించి తల్లిదండ్రులకు నిప్పుపెట్టాడు. ఆ తర్వాత ఇంటి నుంచి పరారయ్యాడు పుత్రరత్నం ప్రసాద్.

స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. మంటలు ఆర్పి.. ఆస్పత్రికి తరలించారు. తండ్రి గాలయ్య పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న కొడుకు ప్రసాద్ కోసం గాలిస్తున్నారు.