Tamil actor Mansoor ali khan : కోవిడ్ పై దుష్ప్రచారం..నటుడు మన్సూర్ ఆలీఖాన్ పై కేసు
ప్రముఖ తమిళ హస్య నటుడు వివేక్ మరణానంతరం... కోవిడ్ వ్యాక్సిన్ పై, కరోనాపై తప్పుడు ఆరోపణలు చేసిన తమిళ నటుడు మన్సూర్ ఆలీఖాన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
Tamil actor Mansoor ali khan filed a pre bail petition : ప్రముఖ తమిళ హస్య నటుడు వివేక్ మరణానంతరం… కోవిడ్ వ్యాక్సిన్ పై, కరోనాపై తప్పుడు ఆరోపణలు చేసిన తమిళ నటుడు మన్సూర్ ఆలీఖాన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
తమిళ హాస్యనటుడు వివేక్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మర్నాడు గుండెపోటు రావటంతో ఆస్పత్రిలో చేరారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తుండగా ఏప్రిల్ 17 న కన్ను మూశారు. గుండె సంబంధిత వ్యాధితో వివేక్ మరణించినట్లుగా డాక్టర్లు ధృవీకరించారు.
వివేక్ ఆస్పత్రిలో చేరినప్పుడు తమిళ నటుడు మన్సూర్ ఆలీఖాన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యంగా ఉన్న మనిషిని వ్యాక్సిన్ పేరుతో మంచం ఎక్కించారని ఆరోపించారు. ఇంతలో వివేక్ మరణించటంతో మన్సూర్ ఆగ్రహానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ను టార్గెట్ చేస్తూ ఆయన ఘూటుగా విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్ అనేది ప్రజలను గుప్పిట్లో ఉంచుకునేందుకు పాలకులు చేస్తున్న పొలిటికల్ స్టంట్గా దుయ్యబట్టారు.
మన్సూర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలు వైరల్ కావడంతో చెన్నై కార్పొరేషన్ కమిషనర్ ప్రకాష్ చర్యలు చేపట్టారు. మన్సూర్పై డీజీపీ త్రిపాఠీకి ఫిర్యాదు చేశారు. కోవిడ్ వ్యాక్సిన్పై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో మన్సూర్పై వడపళని పోలీస్స్టేషన్లో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై కేసు నమోదయ్యే సరికి మన్సూర్ అలీఖాన్ కోర్టును ఆశ్రయించారు. మిత్రుడిని కోల్పోయిన ఆవేదనలో వ్యాఖ్యానించానని, ఆయనకు ఎలాంటి దురుద్దేశం లేదని మన్సూర్ తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీనిపై కోర్టు ఈ రోజు, రేపట్లో (ఏప్రిల్20,21ల్లో) విచారించే అవకాశముంది.