ముత్తూట్ ఫైనాన్స్ లో భారీ చోరీ- ఏడున్నర కోట్ల బంగారం లూటీ
Armed gang robs 25kg of gold from Muthoot Finance in Hosur : తమిళనాడులో భారీ చోరీ జరిగింది. క్రిష్ణగిరి జిల్లా హోసూర్ లోని ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ బ్రాంచ్లోకి చొరబడ్డ దుండగులు పెద్ద మొత్తంలో బంగారం ఎత్తుకెళ్లారు. దీని విలువ సుమారు రూ. 7.5 కోట్లకుపైనే ఉంటుందని తెలుస్తోంది. రోజూ మాదిరిగానే శుక్రవారం ఉదయం సిబ్బంది బ్రాంచ్ను తెరిచారు. బ్రాంచ్ తెరిచిన కొద్దిసేపటికే కస్టమర్ల రూపంలో హెల్మెట్ లో ధరించిన అయిదుగురు దుండగులు లోపలికి ప్రవేశించారు.
మొదట వాచ్ మెన్ ను కొట్టి లోపలకు తీసుకువెళ్లారు. ఆ సమయంలో ఆఫీసులో నలుగురు ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. వారిని తుపాకీతో బెదిరించి కట్టేశారు. అనంతరం లాకర్ తాళం తీసుకుని.. సుమారు 25కేజీలకుపైగా బంగారాన్ని, రూ. 96 వేల నగదును దోచుకెళ్లారు.
ఇతర ఉద్యోగులు, సిబ్బంది ఆఫీసుకు వచ్చాక అసలు విషయం బయటపడింది. కట్టేసి ఉన్న నలుగురిని విడిపించి.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు.. దర్యాప్తు చేస్తున్నారు. బంగారు ఆభరణాల విలువ సుమారు రూ. 7.5 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దుండగుల కోసం గాలిస్తున్నారు.