మూఢ నమ్మకాల పేరుతో కూతుర్ని హత మార్చిన తండ్రి

మూఢ నమ్మకాల పేరుతో కూతుర్ని హత మార్చిన తండ్రి

superstitious father felt that the sick daughter was possessed by a ghost, taken to a tantric exorcism : శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృధ్ది చెందుతున్నా ప్రజలకు ఇంకా మూఢనమ్మకాల పై నమ్మకం మాత్రం పోవటం లేదు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఇటీవల మూఢనమ్మకాల పేరుతో ఇద్దరు కూతుళ్లను హతమార్చిన ఘటన మరువకు ముందే తమిళనాడు లోని  రామనాథపురం జిల్లాలో మూఢనమ్మకాల పేరుతో కూతుర్ని చిత్రహింసలకు గురిచేసి చంపిన ఘటన వెలుగు చూసింది.

రామనాథపురం లో నివసించే వీరసెల్వంకు మూఢనమ్మకాలు,తాంత్రిక పూజలు అంటే విపరీతమైన ఆసక్తి. వాటిని పాటిస్తూ ఆచరిస్తూ ఉంటాడు. అతని కూతురు తరుణి(19) గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతోంది. తరుణి తల్లి 9 ఏళ్ల క్రితం మరణించింది.

తరుణి కొన్నాళ్ల క్రితం తన తల్లి సమాధి వద్దకు వెళ్లి వచ్చింది. అప్పటి నుంచి ఆమె అనారోగ్యంతో ఉంది. భార్య ఆత్మ తన కూతురు శరీరంలోకి ప్రవేశించబట్టే ఆమె అనారోగ్యం పాలయ్యిందని వీరసెల్వం భావించాడు. తరుణి శరీరంలోంచి భార్య ఆత్మను వెళ్లగొట్టటానికి ఆమెను ఒక భూత వైద్యుడు వద్దకు తీసుకువెళ్లాడు.

ఆ భూత వైద్యుడు తాంత్రిక పూజలు చేయడం మొదలెట్టాడు.అందులో భాగంగా పూజ మొదలెట్టి..అక్కడ తరుణిని కూర్పోబెట్టి ఆమె నడుము, మెడ మీద  కర్రతో దాడి చేసినట్లు తెలుస్తోంది. దెబ్బల ధాటికి ఆమె స్పృహ కోల్పోయింది. అప్పటికే అనారోగ్యంతో ఉన్న ఆమె ఆరోగ్యం ఈ దెబ్బలతో మరింత క్షీణించింది.

వెంటనే వీర సెల్వం కుమార్తెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాగా…తరుణి టైఫాయిడ్ జ్వరంతో బాధ పడుతోందని సరైన చికిత్స చేయించకపోవటం వల్లే ఆమె మరణించిందని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఉచిపులి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.