టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడుకు తప్పిన ప్రమాదం

  • Published By: chvmurthy ,Published On : November 30, 2019 / 01:45 AM IST
టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడుకు తప్పిన ప్రమాదం

టీడీపీ సీనియర్‌ నేత కె.అచ్చెన్నాయుడు  రోడ్డు ప్రమాదంలో తృటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొట్టింది. నవంబర్29, శుక్రవారం రాత్రి 10 గంటల 15నిమిషాల సమయంలో నక్కపల్లి పోలీస్‌ స్టేషన్‌ సమీపానికి వచ్చేసరికి ఒక బైక్‌ అడ్డంగా వచ్చింది.  బైక్‌ను తప్పించే క్రమంలో డ్రైవర్‌ కారును పక్కకు పోనివ్వడంతో  డివైడర్‌ను ఢీకొట్టింది.

ఈ ఘటనలో కారు ముందు భాగం దెబ్బతింది. అచ్చెన్నాయుడి ఎడమ చేయి చిటికెన వేలుకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆయనను నక్కపల్లి సీఐ విజయ్‌కుమార్‌ పోలీస్‌ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అమరావతి నుంచి విశాఖకు  వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న  టీడీపీ అధినేత చంద్రబాబు… నేరుగా అచ్చెన్నాయుడికి ఫోన్‌ చేసి పరామర్శించారు.