జీహెచ్ఎంసీ ఎన్నికలు : ఏ పార్టీ..ఏ సామాజికవర్గానికి..ఎన్ని సీట్లు ఇచ్చింది ?

  • Published By: madhu ,Published On : November 21, 2020 / 11:08 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు : ఏ పార్టీ..ఏ సామాజికవర్గానికి..ఎన్ని సీట్లు ఇచ్చింది ?

GHMC elections 2020 : నామినేషన్లు అయిపోయాయ్.. స్క్రూటీని కూడా ముగిసింది. ఇక మిగిలింది ఉపసంహరణే. ఇంకా చాలా మందికి బీఫాంలు పెండింగ్‌లో పెట్టాయి పార్టీలు. ఇప్పటివరకు.. ఏపార్టీ.. ఏ సామాజికవర్గానికి.. ఎన్ని సీట్లు ఇచ్చింది? ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలకు.. పెద్ద పీట వేశాయా? ఓసీలకు ఎన్ని డివిజన్లు కేటాయించారు? రిజర్వ్‌డ్ స్థానాల్లో కాకుండా.. జనరల్ కేటగిరీ డివిజన్లలో కూడా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చారా? ఇప్పటివరకున్న గ్రేటర్ రిజర్వేషన్ డిజిట్స్…



150 డివిజన్లు : – 
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో.. మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. ఈసారి కూడా 2016 ఎన్నికల నాటి రిజర్వేషన్లనే అమలు చేస్తున్నారు. అత్యధికంగా జనరల్ కేటగిరీకి 88 స్థానాలు కేటాయించారు. బీసీలకు 50, ఎస్సీలకు 10, ఎస్టీలకు 2 స్థానాలను రిజర్వ్ చేశారు. వీటన్నింటిలో.. 50 శాతం మహిళలకు రిజర్వ్ చేసింది ఎన్నికల కమిషన్.



రిజర్వేషన్ల ప్రకారం : – 
రిజర్వేషన్ల ప్రకారంగా.. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థులకు సీట్లను కేటాయించాయి. ముందుగా బీజేపీ విషయానికొస్తే.. ఆ పార్టీ ఇప్పటివరకు 143 మంది అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. ఇందులో సగానికి పైగా.. అంటే అత్యధికంగా బీసీలకు 86 స్థానాలు కేటాయించింది బీజేపీ నాయకత్వం. ఓసీలకు 40 సీట్లు ఇచ్చారు. ఎస్సీలకు 14, ఎస్టీలకు 2, మైనార్టీలకు ఒక స్థానం కేటాయించారు.



టీఆర్ఎస్: – 
అధికార టీఆర్ఎస్ విషయానికొస్తే.. మొత్తం 150 డివిజన్లకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో సగం స్థానాలను.. అంటే 75 సీట్లను బీసీలకు కేటాయించింది టీఆర్ఎస్. ఓసీలకు 42, ఎస్సీలకు 13, ఎస్టీలకు 3, మైనార్టీలకు 17 సీట్లు ఇచ్చింది గులాబీ పార్టీ.

కాంగ్రెస్ : – 
కాంగ్రెస్ విషయానికొస్తే.. 150 డివిజన్లలో కేవలం ఒక్క స్థానం మినహాయించి 149 చోట్ల అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. అన్ని పార్టీలు.. బీసీలకు ప్రాధాన్యత ఇస్తే.. కాంగ్రెస్ ఎప్పటిలాగే ఓసీలకు పెద్దపీట వేసింది. హస్తం పార్టీ.. అత్యధికంగా ఓసీలకు 67 స్థానాలు కేటాయించింది. బీసీలకు కేవలం 40 సీట్లు మాత్రమే ఇచ్చారు. ఎస్సీలకు 7, ఎస్టీలకు 2, మైనార్టీలకు 29 స్థానాలను కేటాయించారు. మరికొన్ని స్థానాల్లో.. అభ్యర్థులకు ఇంకా బీఫాం ఇవ్వలేదు. అందులో మెజారిటీ స్థానాలు.. బీసీలకు కేటాయించే అవకాశం ఉందని సమాచారం.



ఎంఐఎం : – 
ఎంఐఎం తరఫున ఇప్పటివరకు 75 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో.. ఇప్పటివరకు 42 మంది అభ్యర్థులను మజ్లిస్ అధికారికంగా ప్రకటించింది. ఇందులో.. అత్యధికంగా 39 మంది మైనార్టీలకు టికెట్లు ఇచ్చారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. మజ్లిస్ పార్టీ నుంచి ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీ బరిలోకి దిగుతున్నారు.



బీసీలకు పెద్ద పీఠ: – 
మూడు ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. ఈ గ్రేటర్ ఎన్నికల్లో బీసీలకు పెద్ద పీట వేశాయి. ఉన్న 150 డివిజన్లలో.. బీజేపీ అత్యధికంగా 86 మంది బీసీలకు అవకాశమిచ్చింది. ఆ తర్వాత.. టీఆర్ఎస్ 75 మంది బీసీలకు సీట్లు కేటాయించింది. కాంగ్రెస్ 40 మంది బీసీలకు పోటీ చేసే అవకాశం కల్పించింది. బీసీలకు సంబంధించి.. అన్ని ప్రధాన పార్టీల్లో.. గౌడ, యాదవ, ముదిరాజ్, మున్నూరుకాపులకే ప్రాధాన్యత దక్కింది. మిగతా బీసీ కులాలతో పోలిస్తే.. ఈ 4 సామాజిక వర్గాలకే పార్టీలు ప్రాధాన్యత ఇచ్చాయి. బీజేపీ కూడా మున్నూరు కాపు పార్టీ అనే ముద్ర తొలగించుకునేందుకు.. యాదవ, ముదిరాజు, గౌడ కులాలకు ప్రాధాన్యత ఇచ్చింది. బీజేపీ గ్రేటర్ ఎన్నికల పరిశీలకుడు భూపేంద్ర యాదవ్ వల్ల.. ఈసారి బీజేపీలో యాదవులకు ప్రాధాన్యం పెరిగిందని సమాచారం.



నాలుగు కులాలకు మంచి పట్టు : – 
ప్రధాన పార్టీలన్నీ.. బీసీ కుల్లాలో గౌడ, యాదవ, ముదిరాజ్, మున్నూరుకాపులకే ప్రాధాన్యత ఇవ్వటం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. ఈ 4 కులాలకు హైదరాబాద్‌లో మంచి పట్టు ఉండటంతో పాటు ఓట్లు కూడా దండిగానే ఉన్నాయి. అదేవిధంగా.. ఈ సామాజికవర్గాల నేతలు కూడా ఆర్థికంగా పరిపుష్టంగా ఉంటారని.. ఎన్నికల ఖర్చును తట్టుకుంటారని భావించాయి. అందుకే.. ప్రధాన పార్టీలన్నీ బీసీలకు పెద్ద పీట వేశాయి. దీనివల్ల.. బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పించామని చెప్పుకోవడం పాటు పార్టీకి కూడా మేలు జరిగే అవకాశం ఉంటుందనేది రాజకీయ పార్టీల ఆలోచన.