Telangana:తెలంగాణలో రసవత్తరంగా ఎమ్మెల్సీ ఎన్నికలు..పొలిటికల్ పార్టీల క్యాంపు రాజకీయాలు

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎక్కడికక్కడ గెలుపే లక్ష్యంగా క్యాంపు రాజకీయాలకు అధికార.. విపక్ష పార్టీలు తెరలేపుతున్నారు.

Telangana:తెలంగాణలో రసవత్తరంగా ఎమ్మెల్సీ ఎన్నికలు..పొలిటికల్ పార్టీల క్యాంపు రాజకీయాలు

Mlc Elections

Telangana local body MLC elections : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎక్కడికక్కడ గెలుపే లక్ష్యంగా క్యాంపు రాజకీయాలకు తెరలేపుతున్నారు.. అధికార.. విపక్ష పార్టీలు. తమకు సంబంధించిన వారు.. తమకు మద్దతు ఇస్తున్నవారు.. ఆఖరి నిమిషంలో గోడ దూకకుండా .. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. పెట్టేబేడా సర్దేసి.. ట్రిప్పులకు తీసుకెళ్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 10 మంది అభ్యర్థులు బరిలో ఉండగా గెలుపు కోసం అధికార పార్టీ అభ్యర్థులతో పోటీ పడుతున్నారు. స్వతంత్ర అభ్యర్ధులు.

మెజారిటీ ఓట్లు ఉన్న టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు క్యాంపుకు తరలివెళ్లగా.. అధికారికంగా ఆ పార్టీ అభ్యర్థిని బరిలో నిలపకున్నా .. మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు సూచనతో కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెర లేపింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు శిబిరాన్ని ఏర్పాటు చేసింది? ఎవరికి కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తుందనేది ఆసక్తిగా మారింది. ఆ పార్టీ నాయకులు ఇనుముల సతీశ్‌తో పాటు బీర్పూర్ ఎంపీపీ రమేష్ స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేస్తున్నారు. దీంతో హస్తం పార్టీ వారికి సపోర్ట్ చేస్తుందా? లేదా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

Supreme Court : వాయు కాలుష్యం విషయంలో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ క్యాంపు రాజకీయలు ప్రారంభించింది. టీఆర్‌ఎస్‌కు ఉన్న 777 మంది సభ్యులు.. బెంగళూరు, నర్సాపూర్‌, ఊటీ, ఢిల్లీ, మైసూర్‌లో ఏర్పాటుచేసిన క్యాంపులకు తరలివెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం .. ప్రస్తుతం తమ ఓటర్లను ఆయా నియోజకవర్గాల్లోనే ఉంచింది. కొందరు సిద్దిపేట, నర్సాపూర్‌లోనే ఉండగా.. చాలా తక్కువ మంది మాత్రం గోవా వెళ్లారు. టీఆర్‌ఎస్‌.. కాంగ్రెస్‌ ముఖ్య నేతలు .. ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి మంత్రి హరీశ్‌రావు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి .. పోటా పోటీగా ప్రచారం చేస్తున్నారు. తమకున్న 230 మందిలో .. ఒక్క ఓటు తగ్గినా.. తన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తానంటూ .. జగ్గారెడ్డి ఓట్లు కూడగట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. పైగా టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్ధుల ఓట్లన్నీ తమకే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు టీఆర్‌ఎస్‌కు ఉన్న 777 ఓట్లే కాకుండా .. ఇంకా అదనంగా ఓట్లు సాధిస్తామని .. మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎంఎల్ సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి .. టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు విజయాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని ఖమ్మంలోనే తిష్ట వేశారు. భారీ మెజార్టీతో తాతా మధును గెలిపించుకోవడానికి ఆయన ఖమ్మం కేంద్రంగా పావులు కదుపుతున్నారు. స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్‌కు మెజార్టీ ఓట్ల బలం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీతోపాటు జిల్లా ఎంపిటీసీల సంఘం అధ్యక్షులు పోటీకి దిగడంతో ఈ ఎన్నికపై అందరిలో అసక్తి నెలకొంది.కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం లేనప్పటికీ .. క్రాస్ ఓటింగ్‌పై ఆశ పెట్టుకుని పోటీలోకి దిగింది.

Trains Canceled : జొవాద్ తుపాను ఎఫెక్ట్..పలు రైళ్లు రద్దు

అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మందికిపైగా ఓటర్లు .. టీఆర్ఎస్ క్యాంపులోకి వెళ్ళారు. దీంతో కాంగ్రెస్‌లో టెన్షన్‌ పట్టుకుంది. మరోవైపు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఓటర్లను.. పది నియోజకవర్గాల నుంచి ప్రత్యేక బస్సులు ద్వారా హైదరాబాద్‌ తరలించారు. అక్కడి నుంచి గోవా తరలించారు. కాంగ్రెస్ కూడా తన ఓటర్లను మారేడ్ మిల్లుకి తరలించింది. ఇప్పటివరకు దాదాపు 600 మంది క్యాంపులకు తరలివెళ్ళారు.