జ్యూయలరీ షాపులో భారీ చోరీ

జ్యూయలరీ షాపులో భారీ చోరీ

thieves steal 1200 grams gold in jewellery shop, secunderabad : సికింద్రాబాద్ పాట్ మార్కెట్ లోని ఓ బంగారు నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. చోరీ జరిగిన 24 గంటల్లో పోలీసులు దొంగను పట్టుకున్నారు. మార్కెట్ పోలీసు స్టేషన్ పరిధిలో  అనిల్ జైన్ అనే వ్యక్తి నేమిచంద్ జైన్ జ్యూయలరీ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నాడు.

శుక్రవారం తెల్లవారు ఝూమున గుర్తు తెలియని వ్యక్తులు, షాపు వెనుక వైపు ఉన్న  వెంటలేటర్ తొలగించి షాపు లోపలకు ప్రవేశించారు. లాకర్లు  పగలగొట్టి అందులోని సుమారు 1219 గ్రాముల బంగారు ఆభరణాలు, 302 గ్రాముల వెండి ఆభరణాలు దోచుకు వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం షాపు తెరిచిన గుమాస్తా లాకర్లు తెరిచి  ఉండటం చూసి యజమానికి సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి సీసీ కెమెరాలు పరిశీలించారు.

ఘటనా స్ధలంలో లభించిన ఆధారాలు, సీసీటీవి లోని దృశ్యాలను పరిశీలించిన పోలీసులు జ్యూయలరీ షాపులో గతంలో పని చేసిన డ్రైవర్ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.  డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు చోరీకి గురైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చోరీకి సహకరించిన డ్రైవర్ స్నేహితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు జరుగుతోంది.