అమరావతిలో అరాచకం : రైతుపై పోలీసుల దౌర్జన్యం
అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో ఓ రైతుపై పోలీసుల దౌర్జన్యం చేసి అక్రమ కేసులు బనాయించారు. రాజధాని నిర్మాణానికి భూమి ఇవ్వని రైతు గద్దె మీరా ప్రసాద్ పోలంలోంచి సీఆర్డీఏ అధికారులు రోడ్డు వేస్తుండగా ఉద్రిక్తతకు దారితీసింది. అనుమతి లేకుండా రోడ్డు వెయ్యటావికి వీలులేదని రోడ్డు నిర్మాణాన్ని మీరా ప్రసాద్ అడ్డుకున్నారు. దాంతో అధికారులు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ కేశప్ప ఆధ్వర్యంలో పొలం వద్దకు చేరుకున్న పోలీసులు, సీఆర్టీఏ అధికారులకు అండగా ఉండి రోడ్డు వేయించేందుకు ప్రయత్నించారు. అయినా మీరా ప్రసాద్ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకోవటంతో పోలీసులకు రైతుకు మధ్య ఘర్షణ జరిగింది.
ఇది తెలిసిన గ్రామస్తులు, వైసీపీ నాయకులు ఘటనా స్ధలానికి చేరుకుని మీరా ప్రసాద్ కు మద్దతుగా నిలిచారు. దాంతో పోలీసులు మీరా ప్రసాద్ ను, అతనికి మద్దుతుగా వచ్చిన వారిని బలంవంతంగా అరెస్టు చేసి మీరా ప్రసాద్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం మీరాప్రసాద్ బెయిల్ పై విడుదలయ్యారు. రాజధాని నిర్మాణానికి భూమి ఇవ్వక పోయినా నా పొలంలోంచి రోడ్డు వేస్తున్నారని, ఈ విషయమై , నామీద పెట్టిన కేసులపై కోర్టులో పోరాడతానని ఆయన చెప్పారు.