గాలివాన బీభత్సం..టోల్ గేట్ షెడ్ కూలి దంపతుల మృతి

  • Published By: srihari ,Published On : May 16, 2020 / 10:54 AM IST
గాలివాన బీభత్సం..టోల్ గేట్ షెడ్ కూలి దంపతుల మృతి

మహబూబ్ నగర్ జిల్లాలో భారీ ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురు గాలులకు ఇద్దరు భార్యాభర్తలు మృతి చెందారు. మిడ్జిల్ మండలం మున్ననూర్ లో గాలివాన బీభత్సానికి టోల్ గేట్ షెడ్ కూలి దంపతులు అక్కడికక్కడే చనిపోయారు.

మున్ననూర్ కు చెందిన కృష్ణయ్య, పుష్ప దంపతులు. వారికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మున్ననూరు శివారులో మహబూబ్ నగర్-కోదాడ జాతీయ రహదారిపై కొత్తగా నిర్మిస్తున్న టోల్ గేట్ వద్ద వరి ధాన్యాన్ని ఆరబెట్టారు. 

2020, మే 16వ తేదీ శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీనికి తోడు..భారీగా ఈదురు గాలులు వీచాయి. గాలుల ధాటికి టోల్ గేట్ కుప్పకూలిపోయింది. భారీ ఇనుపకడ్డీలు అక్కడే ఉన్న  కృష్ణయ్య, పుష్ప దంపతులపై పడిపోయాయి. తీవ్ర గాయాలు కావడంతో దంపతులిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

తల్లిదండ్రుల మృతదేహాలను చూసి పిల్లలు బోరున విలపిస్తుండడం అక్కడున్న వారిని కలిచివేసింది. అమ్మా లే అమ్మా అంటూ గుండెలవిసేలా రోధిస్తున్నారు. తల్లిదండ్రులు మృతి చెందడంతో ఇద్దరు అమ్మాయిలు అనాథలయ్యారు.

Read Here>> అపార్ట్‌మెంట్‌లో బర్త్ డే పార్టీ..23మందికి కరోనా: మూర్ఖత్వానికి ఫలితం