రూ.42 వేల ట్రాఫిక్ జరిమానాలు…బైక్ ను పోలీసులకు అప్పగించి నడుచుకుంటూ వెళ్లాడు

  • Published By: bheemraj ,Published On : November 1, 2020 / 02:48 AM IST
రూ.42 వేల ట్రాఫిక్ జరిమానాలు…బైక్ ను పోలీసులకు అప్పగించి నడుచుకుంటూ వెళ్లాడు

Traffic fines on bike : నాలుగు సార్లు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంగించినందుకే హైదరాబాద్‌ పోలీసులు వాహనం యజమాని ఫోనుకు నోటీసులు పంపిస్తున్నారు. బెంగళూరులోనైతే ఎంచక్కా ఎన్నైనా ఉల్లంఘనలు చేసుకోవచ్చు. కూరగాయలు అమ్ముకునే ఒక వ్యక్తి వాహనం ఏకంగా 77 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిందంట. దాంతో ఆ వ్యక్తికి రూ.42 వేల జరిమానా విధించారు. దాంతో ఆ జరిమానాను చెల్లించేలేనంటూ తన బైక్‌ను పోలీసులకు అప్పగించి నడుస్తూ వెళ్లిపోయాడు.



బెంగళూరులో అరుణ్‌కుమార్ అనే వ్యక్తి కూరగాయలు అమ్ముకుని జీవిస్తున్నాడు. సెకండ్‌ హ్యాండ్‌ బైకును రూ.20 వేలకు కొనుగోలు చేశాడు. అయితే ఈ వాహనం దాదాపు 77 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిందంట. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు ఆయనకు రూ.42 వేల జరిమానా విధించారు.



హెల్మెట్ ధరించకుండా వాహనం నడుపుతుండటంతో ట్రాఫిక్ పోలీసులు అతడిని ఆపి చెక్‌ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కుమార్‌ వాహనంపై రూ.42,500 జరిమానా పెండింగ్‌లో ఉందని తెలిసి అధికారులు షాక్ అయ్యారు. రూ.20 వేలకు కొనుగోలు చేసిన బైకుకు రూ.42,500 జరిమానా విధించడంతో.. కుమార్ తన వాహనాన్ని మాడివాలా ట్రాఫిక్ పోలీసులకు అప్పగించేసి వెళ్లిపోయాడు.

బెంగళూరు ట్రాఫిక్ పోలీసులకు రావాల్సిన చలాన్లు / జరిమానాలు రూ.150 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయని ఒక నివేదిక పేర్కొంది. డ్రైవర్ మొదటి రోజున పెండింగ్‌లో ఉన్న 11,488 కేసులను అధికారులు క్లియర్ చేయగా.. రూ.49 లక్షల జరిమానా వసూలు చేశారు. కలెక్షన్ డ్రైవ్ రెండవ రోజు అక్టోబర్ 22 న మరో 7,978 కేసులను క్లియర్ చేసి.. మరో రూ.34 లక్షల జరిమానా వసూలు చేశారు.