ప్రాణం తీసిన నిర్లక్ష్యం : కారులో ఊపిరాడక చిన్నారి మరణం

  • Published By: veegamteam ,Published On : April 28, 2019 / 06:59 AM IST
ప్రాణం తీసిన నిర్లక్ష్యం : కారులో ఊపిరాడక చిన్నారి మరణం

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ లో విషాదం జరిగింది. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చిన్నారి ప్రాణం తీసింది. కారులో ఊపిరాడక ఐదేళ్ల చిన్నారి కేజియా చనిపోయింది. పెళ్లి జరుగుతున్న ఇంట్లో చిన్నారి మృతితో విషాదం నెలకొంది. ఇంట్లో వాళ్లు పెళ్లి హడావుడిలో పడిపోయారు. కారులో నిద్రిస్తున్న కేజియాను అందులోనే వదిలి వెళ్లారు. ఎండవేడిమికి విలవిలలాడిన చిన్నారి ఊపిరి అందక కారులోనే చనిపోయింది.  గంట ముందు ఆడుతూ కనిపించిన పాప.. చనిపోవడం అందరిని కలిచివేసింది. ఆ ఇంట్లో విషాదచాయలు అలుముకున్నాయి.

కారుని చాలాసేపు ఎండలో ఉంచారు. సాయంత్రం వరకు పాప కారులోనే ఉండిపోయింది. ఓవైపు దాహం, మరోవైపు ఎండల తీవ్రత.. ఉక్కిరిబిక్కిరి అయిన కేజియా చివరికి ప్రాణం విడిచింది. కారు డోర్ లాక్ కావడంతో పాప బయటికి రాలేకపోయింది. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం, బంధువులు పెళ్లి హడావుడిలో పడిపోవడం పాపం ప్రాణం తీశాయి. కుటుంబసభ్యుల తీరుపైనా విమర్శలు వస్తున్నాయి. అంతసేపటి వరకు పాపను పట్టించుకోకపోవడం దారుణం అంటున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.