ఆమెకు న్యాయం జరిగేదెప్పుడు? : ఉన్నావ్ దీపం ఆరిపోయింది
మరో విషాదం చోటు చేసుకుంది. దిశ ఘటనలో నిందితులను ఎన్ కౌంటర్ చేసిన క్రమంలో దేశ వ్యాప్తంగా సంతోషం వ్యక్తమౌతుంటే…దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నావ్ అత్యాచార బాధితురాలు అర్థరాత్రి కన్నుమూసింది. మృత్యువుతో పోరాడుతూ చనిపోయింది. ఢిల్లీలోని సఫ్దార్జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె… 2019, డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం రాత్రి 12గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు తెలిపారు. మృతురాలిని బతికించేందుకు కృషి చేశామని అయినా తనను రక్షించలేకపోయామని వైద్యులు తెలిపారు. 90శాతానికిపైగా కాలిపోవడంతో అవయవాలు స్పందించకుండా పోయాయన్నారు. దీంతో ఆమెకు మెరుగైన వైద్యం అందించినా కాపాడలేకపోయారు. ఈమెకు న్యాయం జరిగేదెప్పుడోనని ప్రజలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగింది : –
* మార్చిలో ఇద్దరు వ్యక్తులపై ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్కు చెందిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
* తనపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. అదంతా సెల్ఫోన్లో వీడియో తీసారంటూ ఫిర్యాదులో పేర్కొంది.
* యువతి ఫిర్యాదు మేరకు రాయ్బరేలీ లాల్గంజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రస్తుతం రాయ్బరేలీ కోర్టులో విచారణ జరుగుతోంది.
* నిందితుల్లో ఒకరిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా.. మరో నిందితుడిని మాత్రం ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు.
* ఇదే క్రమంలో డిసెంబర్ 05వ తేదీ గురువారం ఆమె కోర్టు విచారణ కోసం రాయబరేలీ వెళ్లేందుకు బైస్వారా బీహార్ రైల్వేస్టేషన్కు వెళ్తోంది.
* ఐదుగురు యువకులు హరిశంకర్ త్రివేది, కిశోర్ శుభమ్, శివమ్, ఉమేష్లు దారిలో అటకాయించి దాడి చేశారు.
* కింద పడిపోయిన బాధితురాలిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు.
Read More : ఉల్లిపాయలు లేవన్నాడని…వేలు కొరికేశాడు
* కిరోసిన్ పోసి నిప్పంటించినా తనను తాను కాపాడుకునేందుకు తీవ్రంగా పోరాడింది బాధితురాలు.
* మంటల్లో కాలిపోతూనే దాదాపు కిలోమీటర్ దూరం పరుగెత్తింది.
* శక్తిని, ధైర్యాన్ని కూడగట్టుకొని తానే స్వయంగా అంబులెన్స్ కోసం 112కి డయల్ చేసింది.
* బాధితురాలిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
* కాలిన గాయాలతోనే ఆమె పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది.
* ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
* నిందితుల చర్యను మేధావులు, ప్రజాసంఘాల నేతలు తప్పుపడుతున్నారు. నిందితులను జైలులో పెట్టకుండా బహిరంగంగా తిరిగే స్వేచ్చ ఇస్తే.. పరిస్థితి ఇలానే ఉంటుందని మండిపడుతున్నారు.
* వారికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.