వన్ సైడ్ లవ్…ప్రేమికురాలిని చంపబోతే మరో ఇద్దరు బలి

వన్ సైడ్ లవ్…ప్రేమికురాలిని చంపబోతే మరో ఇద్దరు బలి

Unnao Horror : Minor boy planned murder, Mixed Pesticide In Water To Kill Girl Who Rejected Her Proposal : ఓ 18 ఏళ్ల యువకుడు తన  పక్క  గ్రామంలోని  యువతిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఆ విషయం ఆ యువతికి చెప్పలేక, చెప్పలేక చెప్పాడు. కానీ ఆ యువతి అతడి ప్రేమను తిరస్కరించింది. ఆమెపై కోపం పెంచుకున్న యువకుడు ఎలాగైనా ఆ యువతిని అంతమొందించాలని ప్లాన్ చేశాడు. వారితో మంచిగా ఉంటూనే ఆమెను హత్యచేసేందుకు పన్నాగం పన్నాడు. చివరికి తన ప్రియురాలిని చంపబోతే ఆమె చెల్లెళ్లు ఇద్దరూ మరణించారు. ప్రేయసి చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతోంది.

ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లాలో పాఠక్ పూర్ గ్రామానికి చెందిన వినయ్(18) అలియాస్ లంబూ తన పక్క గ్రామంలోని ఒక అమ్మాయిని  ప్రేమించటం మొదలెట్టాడు. ఒక మంచిరోజు చూసి ఆమె వద్ద తన ప్రేమను వ్యక్త పరిచాడు. అందుకు ఆమె తిరిస్కరించింది.

వీరిద్దరివీ వేర్వేరు గ్రామాలైనప్పటికీ, బాబుహరా గ్రామంలో ఇద్దరివి పక్క, పక్క పొలాలు అవటంతో తరచూ పొలం వద్ద కలుసుకుంటూ ఉండేవారు. ఆ క్రమంలో వినయ్ ఆ అమ్మాయి మీద మనసు పారేసుకున్నాడు. తన ప్రేమను ఎప్పుడైతే తిరస్కరించిందో అప్పుడే ఆమెను చంపాలని డిసైడ్ అయ్యాడు.

పైకి ఎటువంటి ద్వేషం కనపడనీయకుండా జాగ్రత్తపడ్డాడు. ఎప్పటిలాగానే ఈనెల 17 న ఆ యువతి తన ఇద్దరు చెల్లెళ్లతో కలిసి పొలం వద్దకు వచ్చింది. ఆదే సమయంలో వినయ్ కూడా పొలం వద్ద ఉన్నాడు.  మధ్యాహ్నం సమయంలో తమతో తెచ్చుకున్న స్నాక్స్ తినటానికి అక్క చెల్లెళ్లు  చెట్టు నీడకు చేరారు.

అదే సమయంలో తన ప్లాన్ అమలు చేయటానికి సిధ్దమైన వినయ్ కూడా తనవద్ద ఉన్న టిఫిన్ బాక్స్, వాటర్ బాటిల్ తీసుకుని వారి వద్దకు వెళ్లాడు. వారందరూ కల్సి చెట్టుకింద కూర్చుని తింటూ ఉండగా వినయ్ ప్రేమించిన యువతికి మంచినీళ్లు తాగమని ఇచ్చాడు. ఆమె కాస్త తాగే సరికి మిగిలిన సోదరీమణులిద్దరూ ఆమె వద్ద నుంచి వినయ్ ఇచ్చిన వాటర్ బాటిల్ లాక్కోని తాగేశారు.

ఈ హఠాత్ పరిణామానికి వినయ్ కంగు తిన్నాడు. వారిద్దరూ ఆ నీటిని లాక్కోని తాగుతారని ఊహించలేదు. ఆనీరు తాగిన కొద్ది సేపటికి ముగ్గురూ స్పృహ కోల్పోయారు. వినయ్ ఆ మంచినీటిలో క్రిమిసంహారక గుళికలు కలిపాడు. ముగ్గురు బాలికలు స్పృహకోల్పోవటంతో భయంతో వినయ్ అక్కడి నుంచి పరారయ్యాడు.

కొన్ని గంటల తర్వాత ఆ ప్రాంతానికి వచ్చిన  రైతులు వీరిని చూసి  పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్దలానికి వచ్చిన పోలీసులు ముగ్గురుని కాన్పూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వినయ్ ఎవరినైతే చంపాలనుకున్నాడో ఆ బాలిక చావు బతుకుల మధ్య ప్రాణాలతో పోరాడుతోంది.మిగిలిన ఇద్దరూ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

ఘటనా స్ధలిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కాల్చిపారేసిన సిగరెట్ ముక్కలు, వాటర్ బాటిల్ లభ్యమయ్యింది. ఆ రెండిటి ఆధారంగా నిందితుడు వినయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో తానే విషపు గుళికలు కలిపిన నీటిని ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు. కాగా… నిందితుడిని ఉరి తీయాలని మృతురాళ్ల బంధువులు డిమాండ్ చేస్తున్నారు.