ఉద్యోగం కోసం స్పందనలో ఆత్మహత్యాయత్నం
నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో.. దారుణం చోటు చేసుకుంది. డక్కిలి మండలంలో గతంలో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్గా పనిచేసిన భాగ్యలక్ష్మి అనే వెలుగు ఉద్యోగిని .. ఆత్మహత్యాయత్నం చేసింది. ఉద్యోగం నుంచి తనను అన్యాయంగా తొలగించారని.. తన ఉద్యోగం తనకు ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరిగినా .. ఫలితం లేదని చెప్పింది. తనను పీడీ మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరగడం లేదంటూ.. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది.
ఆ మహిళ చేసిన పనితో అధికారులు షాక్ తిన్నారు. వెంటనే స్పందించి ఆమెని ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఆమెకి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. భాగ్యలక్ష్మి ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. దీనిపై నివేదిక ఇవ్వాలని అధికారులతో చెప్పారు. నివేదిక అందాక చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. పీడీ వేధించినట్టు తేలితే చర్యలు తప్పవన్నారు.