రాజధానిలో పౌర “రణరంగం”…హింసాత్మకంగా ఆందోళనలు

  • Published By: venkaiahnaidu ,Published On : December 17, 2019 / 12:13 PM IST
రాజధానిలో పౌర “రణరంగం”…హింసాత్మకంగా ఆందోళనలు

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు ఉదృతంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఢిల్లీలో జామియా మిలియా యూనివర్శిటీలో జరిగిన అల్లర్ల వేడి ఇంకా చల్లారకముందే మరోసారి ఈస్ట్ ఢిల్లీలో ఇవాళ(డిసెంబర్-17,2019) నిరసనకారులు రెచ్చిపోయారు. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జఫరాబాద్ ఏరియాలో నిరసనకారులు చేపట్టిన ప్రదర్శన ఒక్కసారిగా కట్టుతప్పింది.

ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పాటు బస్సులు, ద్విచక్ర వాహనాలకు నిప్పుపెట్టడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలికి అదనపు బలగాలను రప్పించారు. ప్రజలు ఆందోళనలకు దూరంగా ఉండాలని, రోడ్లపైకి రావద్దని, ప్రశాంతంగా ఉండాలని అటు పోలీసులు పిలుపునిచ్చారు.