వరంగల్‌లో 9 మంది డెత్ మిస్టరీ : YouTube చూసి..మర్డర్లకు ప్లాన్

  • Published By: madhu ,Published On : May 25, 2020 / 04:44 AM IST
వరంగల్‌లో 9 మంది డెత్ మిస్టరీ : YouTube చూసి..మర్డర్లకు ప్లాన్

వరంగల్ జిల్లా గొర్రెకుంట డెత్ మిస్టరీలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ప్రధాన నిందితుడు సంజయ్…Youtubeలో చూసి మర్డర్లకు ప్లాన్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 10 మందిని సంజయ్ చంపేశాడని తేల్చారు. మక్సూద్ సమీప బంధువు చోటీని కూడా ఇతను హత్య చేశాడని తెలుస్తోంది.

గతంలో చోటీతో ఇతను సహజీవనం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. చోటీ హత్య బయటపడుతుందనే భయం, బుస్రా కూడా దూరమవుతుండడంతో 9 మంది హత్యలకు ప్లాన్ వేశాడని నిర్ధారించారు. సంజయ్ కు ఓ ఆటో డ్రైవర్ సహకరించారని సమాచారం. కూల్ డ్రింక్ లో నిద్రమాత్రలు ఇచ్చి..స్పృహ కోల్పోయిన అనంతరం గోనె సంచుల్లో ఈడ్చుకెళ్లి బావిలో పడేశారు నిందితులు.

ప్రస్తుతం సంజయ్ తో పాటు మరో నలుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. స్తంభంపల్లిలోని సంజయ్ కుమార్ ఇంట్లో కీలక ఆధారాలు గుర్తించారు. నిందితులను 2020, మే 25వ తేదీ మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కేవలం 48 గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకుని మిస్టరీని చేధించారు పోలీసులు. విచారణలో పోలీసుల ముందు సంజయ్ నేరం అంగీకరించాడు. 

అసలేం జరిగింది :-
సంజయ్‌ కుమార్ యాదవ్‌‌… మక్సూద్‌కు అత్యంత సన్నిహితమైన వ్యక్తి. కుటుంబసభ్యులతో అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. అయితే మక్సూద్‌ కూతురు బుస్రా.. భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. బుస్రా ఒంటరిగా ఉంటుందని గ్రహించిన సంజయ్‌కుమార్‌.. ఆమెకు దగ్గరవ్వాలనుకున్నాడు. అందులో భాగంగా ఆమెకు గిఫ్ట్‌లు కొనిచ్చేవాడు. ఆర్థికంగా ఆ కుటుంబానికి అప్పుడప్పుడు సాయపడేవాడు.

ఇటీవల బుస్రా… యాకూబ్‌ పాషాతో సన్నిహితంగా ఉంటుందని తెలుసుకున్నాడు. దీంతో తనకు దక్కాల్సిన బుస్రా… మరొకరికి  సన్నిహితంగా ఉంటోందంటూ రగిలిపోయాడు. తాను పెట్టిన డబ్బంతా తిరిగి రాబట్టాలనుకున్నాడు. బుస్రాపై ఒత్తిడి తెచ్చాడు. లాక్‌డౌన్‌ సమయంలో డబ్బు కోసం మరింత టార్చర్‌ చేశాడు. విషయాన్ని తండ్రికి చెప్పింది. అటు తమ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న మృతుడు షకీల్‌ కుటుంబానికి కూడా చేరవేసింది.

దీంతో ఇటు మక్సూద్‌, అటు షకీల్‌… సంజయ్‌కుమార్‌ను మందలించారు. చనిపోయిన ఇద్దరు బీహార్‌ యువకులు శ్యామ్, రామ్‌లకు మక్సూద్‌ కుటుంబంతో పరిచయం ఉంది. దీంతో ఆ ఇద్దరికి కూడా సంజయ్‌కుమార్‌  వేధిస్తున్నాడంటూ బుస్రా చెప్పింది. వాళ్లు కూడా సంజయ్‌కుమార్‌ను గట్టిగా మందలించారు. అందరినీ అంతం చేయాలనుకున్నాడు. అయితే తనమీద ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు.

ఎప్పుడైతే  అంతం చేయాలనుకున్నాడో.. అప్పటి నుంచి మక్సూద్‌ కుటుంబం, షకీల్‌, బీహారీ యువకులతో మంచిగా మెలిగాడు. వాళ్లు కూడా  సంజయ్‌ మారిపోయాడని నమ్మారు. తన పుట్టినరోజు అంటూ అందరినీ నమ్మించాడు. బుధవారాన్ని ముహుర్తంగా ఎంచుకున్నాడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో… టాటా ఏస్‌ వాహనంతో గోడౌన్‌కు వచ్చాడు. ఆహార పదార్థాలు, కూల్‌డ్రింక్స్‌లో నిద్రమాత్రలను కలిపాడు. ఎవరెవరిని అయితే అంతం చేయాలనుకున్నాడో.. ప్లాన్‌ ప్రకారం వాళ్లకే వాటిని అందజేశాడు. అనంతరం స్రృహ కోల్పోయిన తర్వాత ఒక్కొక్కరిని ఈడ్చుకెళ్లి బావిలో పడేశాడు. దీంతో తొమ్మిది మందిది హత్యేనని తేలింది.

Read: వరంగల్ లో 9 మంది డెత్ మిస్టరీ వీడింది : ఎలా చంపాడో తెలుసా