వరంగల్ కిల్లర్.. అక్రమ సంబంధం అతడిని హంతకుడిని చేసింది, ఆ భయంతోనే 10మందిని చంపేశాడు

  • Published By: naveen ,Published On : May 26, 2020 / 02:29 AM IST
వరంగల్ కిల్లర్.. అక్రమ సంబంధం అతడిని హంతకుడిని చేసింది, ఆ భయంతోనే 10మందిని చంపేశాడు

అక్రమ సంబంధం మంచిది కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలు పోతాయి. హంతకులను చేస్తాయి. మర్డర్లు చేయిస్తుంది. వివాహేతర సంబంధాల కారణంగా పచ్చని సంసారాలు నాశనం అవుతాయి. కుటుంబాలు చిన్నాబిన్నాం అవుతాయి. జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. పిల్లలు అనాథలు అవుతారు. ఇదీ నెత్తీనోరు బాదుకుని మరీ పోలీసులు చెబుతున్న మాట. అక్రమ సంబంధాల కారణంగా అనేక దారుణాలు జరిగాయి. ఎన్నో కుటుంబాలు నాశనం అయ్యాయి. ఇలాంటి ఘటనలు అనేకం జరిగినా, ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. ఇల్లీగల్ ఎఫైర్ ఎంత ప్రమాదకరమో మరోసారి రుజువైంది. వివాహేతర సంబంధం అతడిని హంతకుడిని చేసింది. ఏకంగా 10మందిని మర్డర్ చేయించింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘గొర్రెకుంట’ హత్యల వెనుక అసలు కారణం అక్రమ సంబంధమే.

ఒక హత్యను కప్పిపుచ్చేందుకు 9 హత్యలు:
బావిలో 9మంది మృతదేహాల వెనుకున్న మిస్టరీ వీడింది. హంతకుడు ఎవరో తెలిసింది. హత్యలకు కారణం ఏంటో కూడా తెలిసింది. ఈ దారుణానికి కారణం అక్రమ సంబంధం. అవును, ఇల్లీగల్ ఎఫైర్ అమాయకుల ప్రాణాలు తీసింది. అభంశుభం తెలియని వారు కూడా బలైపోయారు. ఏ పాపం ఎరుగని వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆ దుర్మార్గుడు ఒక హత్యను కప్పిపుచ్చేందుకు మరో 9 మర్డర్లు చేశాడు. ఈ వ్యవహారంతో ఏ మాత్రం సంబంధం లేని అమాయకులను కడతేర్చాడు. మనిషి రూపంలో ఉన్న ఆ నరరూప హంతకుడే సంజయ్ కుమార్.

నిద్రమాత్రలే ఆయుధంగా మర్డర్లు:
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ రూరల్ జిల్లా ‘గొర్రెకుంట’ హత్యల వెనుక దాగిన మరో మిస్టరీ బయటపడింది. నిందితుడు సంజయ్‌కుమార్‌ యాదవ్‌(24) సాగించిన 9 హత్యల కిరాతకానికి అసలు కారణం వెలుగులోకి వచ్చింది. తాను చేసిన ఒక హత్య గురించి ఎక్కడ పోలీసులకు చెబుతారోనన్న భయంతోనే మిగిలిన వారిని అతను చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ పది హత్యలను నిందితుడు ఒకే రీతిలో అందరికీ నిద్రమాత్రలు ఇచ్చి వారు నిద్రలోకి జారుకున్నాకే చేయడం యావత్‌ రాష్ట్రాన్ని గగుర్పాటుకు గురిచేసింది. వరంగల్‌ నగర శివారు గీసుగొండ మండలంలోని గొర్రెకుంటలో ఓ వ్యవసాయ బావిలో 9 మంది హత్య కేసును వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు ఛేదించారు. మే 21న లభించిన నాలుగు, 22న లభించిన ఐదు మృతదేహాలు కలిపి తొమ్మిది మందిని నిందితుడు సంజయ్‌ హత్య చేసి బావిలో పడేశాడని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ రవీందర్‌ సోమవారం(మే 25,2020) మీడియా సమావేశంలో వెల్లడించారు.

wgl

మక్సూద్ బంధువు రఫీకాతో సంజయ్ ఎఫైర్:
జీవనోపాధి కొసం ఆరేళ్ల క్రితం బీహార్‌ నుంచి వరంగల్‌ చేరుకున్న సంజయ్‌ కుమార్‌ యాదవ్‌ మిల్స్‌ కాలనీ ప్రాంతంలోని శాంతినగర్‌లోని గోనె సంచుల తయారీ కేంద్రంలో పనిచేసేవాడు. 20 ఏళ్ల కిందటే పశ్చిమ బెంగాల్‌ నుంచి వచ్చి కరీమాబాద్‌లో స్థిరపడి పడి ఇదే కేంద్రంలో పని చేస్తున్న మహ్మద్‌ మక్సూద్‌ ఆలం (47) కుటుంబ సభ్యులతో అతనికి పరిచయమైంది. మక్సూద్‌తోపాటు ఇంట్లో ఆయన భార్య నిషా ఆలం(40), కూతురు బుష్రా ఖాతూన్‌ (20), కుమారులు మహ్మద్‌ షాబాజ్‌ ఆలం (19) మహ్మద్‌ సోహిల్‌ ఆలం (18), మనవడు (3) ఉండేవారు. ఆ పక్కనే మక్సూద్‌ భార్య నిషా అక్క కుమార్తె రఫీకా (37) ముగ్గురు పిల్లలతో ఉండేది. మక్సూద్‌ కుటుంబంతోపాటు రఫీకాతో కూడా సంజయ్‌కు పరిచయం ఏర్పడింది. రఫీకాకు డబ్బిస్తూ సంజయ్‌ ఆమె ఇంట్లోనే భోజనం చేసేవాడు. భర్తతో విడిపోయి ముగ్గురు పిల్లలతో ఒంటరిగా ఉన్న రఫీకాకు నిందితుడు సంజయ్‌ మరింత దగ్గర కావడంతోపాటు కొద్ది రోజుల అనంతరం రఫీకాను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అదే క్రమంలో గీసుగొండ మండలం జాన్‌పాక స్తంభంపల్లి ప్రాంతంలో రెండు గదుల ఇంటిని అద్దెకు తీసుకొని రఫీకా ఆమె ముగ్గురు పిల్లలతో కలసి నాలుగేళ్లుగా సహజీవనం కొనసాగిస్తున్నాడు.

రఫీకా కూతురుపైనా కన్నేసిన సంజయ్:
రఫీకాతో సహజీవనం చేస్తున్న సంజయ్‌ ఇదే క్రమంలో యుక్త వయసుకు వచ్చిన రఫీకా కుమార్తెపై కన్నేసి.. ఆమెతో చనువుగా ఉండటానికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన రఫీకా.. సంజయ్‌తో పలుమార్లు గొడవ పడింది. అయినా సంజయ్‌ తన పద్ధతి మార్చుకోకుండా మరింత సన్నిహితంగా వ్యవహరిస్తుండంతో ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దీంతో ఎలాగైనా రఫీకాను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న సంజయ్‌ తమ పెళ్లి విషయాన్ని బంధువులతో చెప్పేందుకు పశ్చిమ బెంగాల్‌ వెళ్దామని రఫీకాను తీసుకొని మార్చి 6న విశాఖపట్నం వైపు వెళ్లే గరీబ్‌రథ్‌ రైల్లో వరంగల్‌ నుంచి బయలుదేరాడు.

మజ్యిగ ప్యాకెట్ లో నిద్రమాత్రలు కలిపి మర్డర్:
మార్గమధ్యలో మజ్జిగ ప్యాకెట్లు కొనుగోలు చేసి అప్పటికే తనతో తెచ్చుకున్న నిద్రమాత్రలను అందులో కలిపి రఫీకాకు ఇచ్చాడు. కుట్రలో భాగంగానే రఫీకాతో కలసి రైలు పుట్‌ బోర్డ్‌ దగ్గర కూర్చొని మాట్లాడసాగాడు. తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో రైలు ఏపీలోని నిడదవోలు సమీపంలోకి రాగానే తాను వేసుకున్న ప్రణాళిక ప్రకారం మత్తులో ఉన్న రఫీకాను ఆమె చున్నీతోనే గొంతు బిగించి చంపి రైల్లోంచి తోసేశాడు. దీనికి సంబంధించి తాడేపల్లిగూడెం రైల్వే పోలీసులు నంబర్‌ 19/2020 ద్వారా నమోదు చేశారు. రఫీకా చనిపోయిందని నిర్ధారించుకున్నాక రాజమండ్రి స్టేషన్‌లో దిగి తిరిగి మరో రైల్లో సంజయ్‌ వరంగల్‌ చేరుకున్నాడు. రఫీకా పశ్చిమ బెంగాల్‌లోని తమ బంధువులు ఇంటికి వెళ్లినట్లు ఆమె పిల్లలను నమ్మించాడు.

well1

హత్యను కప్పిపుచ్చుకునేందుకే ‘గొర్రెకుంట’ పథకం:
కొద్ది రోజుల అనంతరం తన అక్క కుమార్తె రఫీకా బంధువుల ఇళ్లలో లేదని, రఫీకా ప్రస్తుతం ఎక్కడ ఉందో చెప్పాలని మక్సూద్‌ ఆలం భార్య నిషా ఆలం.. సంజయ్‌ను నిలదీయడంతో పాటు పోలీసులకు చెబుతానని బెదిరించసాగింది. దీంతో కంగుతున్న సంజయ్‌ పోలీసులకు చిక్కుతానని భయపడి మక్సూద్‌ ఆలం, భార్య నిషా ఆలంను హత్య చేయాలని తొలుత నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం రఫీకాను చంపినట్లుగానే నిద్రమాత్రలతో కలిపి చంపాలని ప్రణాళిక రూపొందించాడు. ప్రణాళికను అమలు పర్చడంలో భాగంగా మే 16 నుంచి 20 వరకు మక్సూద్, ఆయన కుటుంబం పని చేస్తున్న గొర్రెకుంటలోని గోనె సంచుల తయారీ గోదాంకు రోజూ వచ్చి వెళ్లాడు. అదే సమయంలో గోదాం పరిసరాలను కూడా పరిశీలించి రెక్కీ నిర్వహించాడు. చివరకు మక్సూద్‌ ఆలం, భార్య నిషా ఆలంను చంపి గోదాం పక్కనే ఉన్న పాడుబడిన వ్యవసాయ బావిలో పడేయాలని నిర్ణయించుకున్నాడు. 

3 మెడికల్ షాపుల నుంచి 60కిపైగా నిద్రమాత్రలు కొనుగోలు:
ఇందులో భాగంగా మే 20న మక్సూద్‌ ఆలం మొదటి కొడుకు షాబాజ్‌ ఆలం పుట్టిన రోజని తెలియడంతో అదేరోజు చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం మే 18న సంజయ్‌ వరంగల్‌ చౌరస్తాలోని రెండు, మూడు మెడికల్‌ షాపుల్లో 60కిపైగా నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు. మే 20న రాత్రి 7.30 గంటల ప్రాంతంలో గోదాంకు చేరుకుని మక్సూద్‌ కుటుంబంతో చాలా సేవు ముచ్చటించాడు. తనకు అనుకూలంగా ఉన్న సమయంలో ఎవరికీ తెలియకుండా మొదట మక్సూద్‌ కుటుంబం తయారు చేసుకున్న భోజనంలో నిద్రమాత్రలు కలిపాడు. మక్సూద్‌ కుటుంబం ఉంటున్న ఇంటి పక్కనే ఉండే బిహార్‌ యువకులు శ్యాం, శ్రీరాంలు తాను వచ్చిన విషయాన్ని ఎవరికైనా చెబుతారేమోనని భయపడి వారు తయారు చేసుకున్న భోజనంలోనూ నిద్రమాత్రలు కలిపాడు. దీంతో మక్సూద్, ఆయన భార్య నిషా ఆలం, కుమార్తె బుష్రా కాటూన్, కుమారులు షాబాజ్‌ ఆలం, సోహెల్‌ ఆలం, మూడేళ్ల మనుమడు… శ్యాం, శ్రీరాంలతోపాటు మక్సూద్‌ ఆహ్వానం మేరకు పుట్టినరోజు వేడుకకు వచ్చిన పశ్చిమ బెంగాల్‌వాసి మహమ్మద్‌ షకీల్‌ మత్తులోకి జారుకున్నారు. దీంతో ఆర్ధరాత్రి 12.30 నుంచి ఉదయం 5 గంటల మధ్య మత్తులో ఉన్న తొమ్మిది మందిని పాడుపడ్డ బావి వద్దకు ఒక్కరొక్కరినీ తీసుకెళ్లి పడేశాడు. అందరూ చనిపోయారని నిర్ధారించుకున్నాక మక్సూద్‌ గది నుంచి వాల్‌మార్ట్‌ నుంచి తెచ్చిన కిరాణ సామానుతోపాటు వారి సెల్‌ఫోన్లు, షకీల్‌ పర్సు తీసుకొని తన ఇంటికి చేరుకున్నాడు.

సీసీ ఫుటేజీ, వాల్‌మార్ట్‌ సరుకులే కీలకం:
ఈ హత్యలపై గీసుగొండ పోలీసులు కేసు నమోదు చేయగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ రవీందర్‌ ఆదేశాల మేరకు ఆరు ప్రత్యేక దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి. గోదాం, గొర్రెకుంట, వెంకట్రామ థియేటర్‌ చౌరస్తా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను ఆధారంగా చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అనుమానంతో స్తంభంపల్లిలోని సంజయ్‌ ఇంట్లో తనిఖీ చేయగా మక్సూద్‌ ఆలం ఇంట్లో మాయమైన వాల్‌ మార్ట్‌ సరుకులు లభ్యమయ్యాయి. ఇలా కచ్చితమైన ఆధారాలు సేకరించిన దర్యాప్తు బృందాలు సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఇంట్లోనే ఉన్న సంజయ్‌కుమార్‌ యాదవ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.

సంజయ్ ని హంతకుడిని చేసిన వివాహేతర సంబంధం:
అక్రమ సంబంధం మోజు సంజయ్‌ కుమార్‌ యాదవ్‌ (24) ను హంతకుడిని చేసింది. అతడితో వివాహేతరం సంబంధం పెట్టుకున్న కారణంగా రఫీకా జీవితం నాశనమైంది. ఆమెతో పాటు ఆమె బంధువుల జీవితాలూ అర్థారంతరంగా ముగిసిపోయాయి. సంజయ్ తండ్రి పేరు పవన్‌రామ్. బీహార్ రాష్ట్రంలోని బిగుసరాయ్‌ జిల్లా నుర్లపూర్‌ గ్రామ వాసి. సంజయ్ ప్రస్తుత నివాసం : స్తంభంపల్లి (జాన్‌పాక), గీసుగొండ మండలం, వరంగల్‌ రూరల్‌ జిల్లా.

Read: తల్లితో రిలేషన్, కూతురిమీద కన్ను…10 హత్యలు.. ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు.. 72 గంటల్లో చేధించాం :సిపి రవీందర్