కిడ్నాపర్ ఎవరు? బాలుడు ఎక్కడ దొరికాడు? పోలీసులు ఎందుకు సీక్రెట్గా ఉంచుతున్నారు? గౌతమ్ కేసులో అనేక సందేహాలు
gautam kidnap case: సూర్యాపేటలో కిడ్నాప్ అయిన బాలుడు గౌతమ్ కథ సుఖాంతమైనప్పటికీ.. అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. 24గంటల పాటు గౌతమ్ ఎక్కడున్నాడు? బాలుడ్ని కిడ్నాప్ చేసింది ఎవరు? కిడ్నాప్ చేసిన తర్వాత బాబును ఎక్కడికి తీసుకెళ్లారు? కిడ్నాపర్ల సమాచారాన్ని పోలీసులు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు? కిడ్నాపర్లు పోలీసుల అదుపులోనే ఉన్నారా? వంటి సందేహాలు తలెత్తుతున్నాయి. బాబును సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన సూర్యాపేట పోలీసులు.. కిడ్నాపర్ల సమాచారాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను ఇవాళ(నవంబర్ 16,2020) వెల్లడిస్తామంటున్నారు.
క్రాకర్స్ కొనేందుకు వెళ్లి అదృశ్యం:
సూర్యాపేటలోని భగత్సింగ్ నగర్కు చెందిన గౌతమ్ శనివారం(నవంబర్ 14,2020) రాత్రి అదృశ్యమయ్యాడు. బాణసంచా కోసమని వెళ్లిన గౌతమ్ ఇంటికి తిరిగిరాలేదు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కుమారుడి కోసం తెలిసిన చోటల్లా వెతికారు. బంధువులందరినీ ఆరా తీశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా బాలుడి ఆచూకీ కనిపించ లేదు. అయితే బాణసంచా షాపు సమీపంలో గౌతమ్ సైకిల్ లభ్యమైంది. ఎక్కడా గౌతమ్ ఆచూకీ లభించకపోవడంతో అతడి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలుడిని సురక్షితంగా కాపాడిన పోలీసులు:
బాలుడి కిడ్నాప్ సమాచారం అందుకున్న పోలీసులు.. గంట లోపే.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దీక్షిత్రెడ్డి ఘటన నేపథ్యంలో.. పోలీసులు వ్యూహాత్మకంగా ఆపరేషన్ చేపట్టారు. జిల్లా ఎస్పీ భాస్కరన్ ప్రత్యేక దృష్టి సారించారు. దర్యాప్తుకు సంబంధించిన ఏ అంశం బయటకు రాకుండా పక్కాగా వ్యవహరించారు. సీఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ పనిచేశాయి. తమ బృందం కదలికలు డిపార్ట్మెంట్ వారికి కూడా తెలియకుండా ఉన్నతాధికారులు జాగ్రత్త తీసుకున్నారు. ఈలోగా బాలుడి తండ్రి మహేశ్కు కిడ్నాపర్ల నుంచి ఫోన్ రావడంతో.. పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే మహేశ్ను తమ ఆధీనంలో ఉంచుకుని.. కిడ్నాపర్లతో మాట్లాడించారు. ఫోన్ సంభాషణలు కొనసాగుతుండగానే.. కిడ్నాపర్లను చేరుకుని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారి చెర నుంచి బాలుడ్ని విడిపించి తల్లిదండ్రులకు అప్పగించారు.
https://10tv.in/five-year-old-boy-kidnapped-in-suryapet-rescued/
ఎవరు కిడ్నాప్ చేశారు, బాలుడు పోలీసులకు ఎక్కడ దొరికాడు?
అయితే బాలుడిని ఎవరు కిడ్నాప్ చేశారు, బాలుడు పోలీసులకు ఎక్కడ దొరికాడు, 24 గంటలు ఎక్కడున్నాడన్న సందేహాలపై పోలీసులు మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రెస్మీట్ లో అన్ని విషయాలు చెబుతామని పోలీసులు చెబుతున్నారు. అయితే బాలుడి కిడ్నాప్పై అనేక సందేశాలు వ్యక్తమవుతున్నాయి. బాలుడి కిడ్నాప్కు పాల్పడింది ఎవరన్నదానిపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు. బాలుడి కిడ్నాప్ చేసిన తర్వాత కిడ్నాపర్స్ ఎక్కడికి తీసుకెళ్లారు, 24 గంటలు ఎక్కడ ఉంచారన్నదానిపై పోలీసులు పెదవి ఇప్పడం లేదు.
పోలీసులు బాలుడి ఆచూకీ ఎలా కనిపెట్టారు.. గౌతమ్.. ఖాకీలకు ఎక్కడ దొరికాడన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. కిడ్నాపర్స్ బాలుడిని వదిలేశారా.. లేక పోలీసులు కిడ్నాపర్స్ను కనిపెట్టి గౌతమ్ను సేఫ్ చేశారా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఇంతకీ కిడ్నాపర్స్ను పోలీసులు అరెస్ట్ చేశారా లేదా.. అన్నదానిపై పోలీసులు క్లారిటీ ఇచ్చే చాన్స్ ఉంది. పోలీసుల ప్రెస్మీట్తో అన్ని సందేహాలకు సమాధానం లభించే అవకాశముంది.