భర్తకు విడాకులు ఇవ్వకుండానే ప్రియుడితో తాళి కట్టించుకున్న ఇల్లాలు

  • Published By: chvmurthy ,Published On : February 25, 2020 / 12:03 PM IST
భర్తకు విడాకులు ఇవ్వకుండానే ప్రియుడితో తాళి కట్టించుకున్న ఇల్లాలు

భర్త ఉండగానే ప్రియుడితో తాళి కట్టించుకుంది ఓ ఇల్లాలు. తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్త హత్యకు సహకరించింది. కేసు విచారణలో దొరికిపోయి జైలు పాలయ్యింది.   తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని గొడారిగుంట దుర్గానగర్ లో ఫిబ్రవరి 19న  లారీ డ్రైవర్ నక్కా బ్రహ్మానందం @ బ్రహ్మాజీ(29) దారుణ హత్యకు గురయ్యాడు. కేసును విచారించిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 

లారీ డ్రైవర్ గా పని చేసే  బ్రహ్మానందం, మరదలు మంగలక్ష్మిని వివాహం చేసుకుని దుర్గానగర్ లో నివాసం ఉంటున్నాడు. వీరికి ఒకపాప, బాబు  ఉన్నారు. మంగలక్ష్మి కాకినాడ కార్పొరేషన్‌లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. అల్లవరం మండలం డి.రావులపాలెం గ్రామం సావరంపేటకు చెందిన ఈతకోట సూర్యప్రకాష్‌ అనే వ్యక్తి డిగ్రీ పూర్తి చేసి కానిస్టేబుల్‌ ఉద్యోగంలో చేరే ఆశయంతో ట్రైనింగ్‌ తీసుకోటానికి కాకినాడ వచ్చాడు. 
 

ట్రైనింగ్ మధ్యలో మానేసి కార్పోరేషన్ లో 47వ డివిజన్ లో అవుట్ సోర్సింగ్  పద్దతిలో చేరి శానిటరీ సూపర్ వైజర్ గా జాయిన్ అయ్యాడు. ఈ క్రమంలో అక్కడ మంగలక్ష్మితో పరిచయం ఏర్పడింది. క్రమేపి అది అక్రమ సంబంధానికి దారి తీసింది. అది మరింత ముదిరి ప్రియురాలితో ఎక్కవ సేపు  గడిపేందుకు  మంగలక్ష్మి ఇంటి పక్కనే ఇల్లు అద్దెకు తీసుకున్నాడు సూర్యప్రకాష్. దీంతో వారిద్దరి మధ్య బంధం మరింత పెరిగింది. బ్రహ్మాజీ ఎక్కవ సమయం లారీ మీద వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళే వాడు. 
 

మంగలక్ష్మి ఇంటి పక్కనే అద్దెకు దిగిన  సూర్యానికి ఇది బాగా కలిసొచ్చింది. బ్రహ్మాజీ ఇంట్లో లేని సమయంలో సూర్య, మంగలక్ష్మి తోనే ఎక్కువ సేపు గడిపేవాడు. వీరి అక్రమ సంబంధాన్ని బ్రహ్మాజీ పసిగట్టి భార్యను ప్రశ్నించాడు. తమ పరిచయానికి భర్త అడ్డంగా ఉన్నాడని భావించి అతడ్ని హతమార్చాలని మంగ, సూర్య ప్లాన్ చేశారు. ఇందుకోసం హత్య చేయటానికి 3 రోజుల ముందు రెక్కీ నిర్వహించాడు.  

ఎవరికీ అనుమానం రాకుండా సెలవు పెట్టి సొంతూరు వెళ్లాడు. ఫిబ్రవరి 19వ తేదీ రాత్రి ఒంటి గంట సమయంలో మంకీ క్యాప్, చేతులకు గ్లౌస్, స్వెట్టర్‌ ధరించి మోటారు సైకిల్‌తో పాటు ఆయుధం తీసుకుని  సూర్య…. బ్రహ్మానందం ఇంటికి వచ్చాడు. అందుకు మంగలక్ష్మి ముందుగానే తలుపు తీసి ఉంచింది.   ముందుగానే  మంగ భర్త వివరాలను సూర్యకి చేరవేసింది. బ్రహ్మాజీ హత్యకు  మంగ సహకరించటంతో  సూర్య అతి కిరాతకంగా నరికి చంపి పరారయ్యాడు.  20వ తేదీ ఉదయం కేసు నమోదు చేసుకున్న సర్పవరం పోలీసులు విచారణ చేపట్టారు. 
 

విచారణలో భాగంగా  పోలీసులు సూర్య ప్రకాష్ ఇంటిలోనూ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సూర్యప్రకాష్ డైరీలో ఒక చోట మంగ వెడ్స్‌ సూర్య అని.. మంగ బంగారం అని రాసి ఉంది. దీంతో నిందితుడిని పట్టుకోవటం తేలిక అయ్యింది. నిందితుడు ఈతకోట సూర్యప్రకాష్ తో పాటు, సహకరించిన మంగలక్ష్మిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపించారు.  ఒక చిన్న తప్పిదంతో బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు పాపం సూర్య ప్రకాశ్. ప్రియుడి వ్యామోహంలో భర్తను కోల్పోయి పిల్లలను అనాధలను చేసింది మంగలక్ష్మి.