Road Accident : ప్రాణం తీసిన టైర్ పంక్చర్
స్పీడ్గా వెళ్తున్న మోటార్ సైకిల్ వెనుక టైర్ పంక్చర్ కావటంతో దానిపై ప్రయాణిస్తున్న మహిళ కింద పడి మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
Road Accident : స్పీడ్గా వెళ్తున్న మోటార్ సైకిల్ వెనుక టైర్ పంక్చర్ కావటంతో దానిపై ప్రయాణిస్తున్న మహిళ కింద పడి మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. గుడిహుత్నూర్ మండలం సట్వాజీగూడ ఆరోగ్య కేంద్రంలో రెండో ఏఎన్ఎంగా రాథోడ్ సునీత (38) విధులు నిర్వహిస్తోంది. విధి నిర్వహణలో భాగంగా సట్వాజీగూడ గ్రామానికి చెందిన గర్భిణి జె.చాంగునాబాయిని చికిత్స నిమిత్తం మంగళవారం అంబులెన్స్లో రిమ్స్కు తరలించింది.
సునీత భర్త ఉత్తంసింగ్ ఇచ్చోడలోని నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. సునీత రిమ్స్కు వెళ్లేందుకు భర్త ఉత్తంసింగ్తో కలిసి బైక్ మీద రిమ్స్కు బయలు దేరింది. జాతీయ రహదారి నెంబరు 44పై ప్రయాణిస్తుండగా…సీతాగొంది గ్రామ సమీపంలో మోటార్ సైకిల్ వెనుక టైర్ పంక్చర్ కావడంతో అదుపు తప్పి కిందపడ్డారు.
వెనుక కూర్చున్న సునీత ఒక్కసారిగా రోడ్డుమీద పడిపోవటంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. ఉత్తంసింగ్ స్వల్పగాయలతో బయట పడ్డాడు. స్ధానికులు హైవే అంబులెన్స్లో వీరిని రిమ్స్కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.