పాతబస్తీ నర్సును దుబాయ్ షేక్ కు అమ్మేసిన మహిళ

పాతబస్తీ నర్సును దుబాయ్ షేక్ కు అమ్మేసిన మహిళ

Woman selling a young woman to a Sudanese sheikh in the name of a job : దుబాయ్ లో నర్స్ ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి చాంద్రాయణ గుట్టకు చెందిన యువతిని సూడాన్ షేక్ కు విక్రయించిన ఘటన  హైదరాబాద్ పాతబస్తీలో చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా నరకం అనుభవిస్తున్న ఆ యువతి తన కుటుంబ సభ్యలకు సమాచారం ఇచ్చింది.  దీంతో ఆయువతిని భారత్ కు రప్పించాలని బాధిత కుటుంబ సభ్యులు విదేశీ వ్యవహారాల శాఖను వేడుకున్నారు.

బండ్లగూడ గౌస్ నగర్, హుందాహిల్స్ కు చెందిన సయ్యదా భాను కుమార్తె నూర్జహాన్ శంషీర్ గంజ్ లోని కె.ఎం ఆస్పత్రిలో నర్సు గా పని చేసేది. ఈ సమయంలో ఆమెకు వట్టెపల్లికి చెందిన ఫాతిమా అనే మహిళ పరిచయం అయ్యింది. షార్జాలోని ఆస్పత్రిలో నర్స్ గా చేరితే నెలకు రూ.40 వేలు వస్తాయని, అక్కడ తనకు తెలిసిన వారు ఉన్నారని నమ్మించింది.   జీతం ఎక్కువ వస్తుందని నమ్మి ఆమె చెప్పినట్లుగానే షార్జా వెళ్లటానికి సిధ్ధపడింది నూర్జహాన్. ఫాతిమా సహాయంతో నూర్జహాన్ డిసెంబర్ 15న షార్జా చేరుకుంది.

అక్కడ ఆమెను అమ్మర్ అహ్మద్ అనే వ్యక్తి ఆమెను తన ఇంటికి తీసుకువెళ్లాడు.  ఆ ఇంట్లో  ఆమె ఫాతిమాతో కలిసి ఉండే నజ్మీన్ అనే బాలికను చూసింది. మూడు నెలల కాంట్రాక్ట్ మ్యారేజి కింద ఫాతిమా, నజ్మీన్ ను పంపించినట్లు తెలుసుకుంది.  అమ్మర్ తాను ఫాతిమాకు రూ. 2లక్షలు చెల్లించనట్లు నూర్జహాన్ కు  చెప్పాడు. ఫాతిమాకు అమ్మర్‌ ద్వారా ఫోన్‌ కాల్‌ రావడంతో నూర్జహాన్‌ తల్లి వద్దకు వెళ్లి ఆమె ముందు రూ.2 లక్షలు పెట్టి వీడియో తీసి షేక్‌కు పంపించింది. అనంతరం డబ్బు తిరిగి వెనక్కి తీసుకున్నారు.

అప్పటి నుంచి అమ్మర్,  నూర్జహాన్ పై నాలుగు రోజులపాటు అత్యాచారం చేశాడు. దీంతో ఆమె అనారోగ్యం పాలయ్యింది. తాను పడుతున్ననరకాన్ని వాట్సప్ వీడియో ద్వారా తన కుటుంబ సభ్యులకు తెలిపింది. వారు స్ధానిక ఎంబీటీ అధికార ప్రతినిధి ద్వారా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. కాగా బాధిత కుటుంబ సభ్యులనుంచి ఎటువంటి ఫిర్యాదు తమకు అందలేదని చాంద్రాయణగుట్ట పోలీసులు తెలిపారు.