యజమాని భార్యతో పనోడి అక్రమ సంబంధం : సుపారీ హత్య

  • Published By: chvmurthy ,Published On : March 16, 2020 / 03:56 PM IST
యజమాని భార్యతో పనోడి అక్రమ సంబంధం : సుపారీ హత్య

తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టాడు ఓ దుర్మార్గుడు…. ఉద్యోగం ఇచ్చి ఉపాధి చూపించిన యజమాని  భార్యతో అక్రమ సంబంధం  పెట్టుకున్నాడు. ఈ వ్యవహారం ముదిరి చివరికి యజమానిని హత్యచేసేందుకు సుపారీ కుదుర్చుకుని పై లోకాలకు పంపాడు. ఇద్దరి మధ్య అక్రమ సంబంధం కారణంగా ఒక అమాయకుడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. భార్య ప్రియుడు చేసిన హత్యతో సిరిసిల్ల జిల్లాలో  ఓ వ్యాపారి  అర్ధంతరంగా తనువు చాలించాడు.

సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి  మండలం బస్వాపూర్ గ్రామ శివారులో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన టెంట్ హౌస్ యజమాని తిరుపతి హత్య కేసులో అనేక కొత్తకోణాలు వెలుగు చూస్తున్నాయి. అతడి భార్య మమత, ప్రియుడు సురేష్ తో కలిసి హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తేల్చారు. 

ఇల్లంతకుంట మండలం రామోజీపేటకు చెందిన తిరుపతి బద్దెనపల్లిలో టెంట్‌హౌస్ నిర్వహిస్తున్నాడు. తిరుపతి వద్ద సురేశ్‌ అనే యువకుడు పని చేస్తున్నాడు. తరచూ యజమాని  తిరుపతి ఇంటికి వచ్చే పోయే సురేష్ యజమాని భార్య మమతపై కన్నేశాడు. ఈ క్రమంలో ఆమెతో మాటలు కలిపి ఆమెను లొంగదీసుకున్నాడు. అప్పటి నుంచి ఇద్దరు కలిసి తిరుపతికి తెలియకుండా అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ రాసలీలలు సాగిస్తూ  వస్తున్నారు. ఇటీవల ఈ విషయం తిరుపతికి తెలిసి పద్ధతి మార్చుకోవాలని  భార్య మమతను మందలించాడు. తమ రాసలీలలకు అడ్డుగా ఉన్న భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు సురేశ్‌తో కలిసి మమత ప్లాన్ వేసింది.ప్లాన్‌ ప్రకారం తిరుపతిని హత్య చేసేందుకు సురేశ్‌ రూ.40 వేలకు నలుగురు వ్యక్తులతో సుపారి కుదుర్చుకున్నాడు. 

ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం శుక్రవారం మార్చి13న మమత తనకు కడుపునొప్పి వచ్చిందని భర్తను నమ్మించింది. కడుపునొప్పి భరించలేకపోతున్నానని చెప్పి భర్తను అర్ధరాత్రి బస్వాపూర్‌కు బయలు దేర తీసింది. అప్పటికే గ్రామశివారులో మాటువేసిన సురేశ్‌ అతడి స్నేహితులు కారుతో అటకాయించి కత్తులు, గొడ్డళ్లతో  తిరుపతిపై దాడిచేసి విచక్షణారహితంగా పొడిచి హత్యచేశారు. తిరుపతి ఇక చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత కారులో అక్కడి నుంచి పరారయ్యారు. 
husband murder

ఇక మమత కొత్త నాటకానికి తెరతీసింది.  ప్రమాదంలో భర్త హతమయ్యాడని…హత్యను ప్రమాదంగా మార్చేందుకు మమత శాయశక్తులా ప్రయత్నించింది. ఘటనపై అనుమానం వచ్చిన బంధువులు  పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తిరుపతి శరీరంపై ఉన్న గాయాలను బట్టి హత్యగా తేల్చారు. పోస్టు మార్టం రిపోర్టులో కూడా  కిరాతకంగా హత్య చేసినట్లు తేలింది. దీంతో పోలీసులు మమతను అదుపులోకి తీసుకుని విచారించారు. అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడనే భర్తను హత్య చేయించినట్లు ఆమె పోలీసు విచారణలో అంగీకరించింది. మిగిలిన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. త్వరలో హంతకులను మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.