ప్రేమించలేదని యువతిని హత్య చేసిన ప్రేమోన్మాది

  • Published By: chvmurthy ,Published On : April 28, 2019 / 02:10 PM IST
ప్రేమించలేదని యువతిని హత్య చేసిన ప్రేమోన్మాది

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజగొప్పులో దారుణం జరిగింది. ప్రేమోన్మాదంతో విచక్షణ మరిచిన ముగ్గురు యువకులు మహిత అనే యువతిని నడిరోడ్డుపై దారుణంగా కత్తితో గొంతు కోసి హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

భీమవరం మండలం బేతపూడికి చెందిన మహిత ఇంటర్మీడియట్ చదువుతోంది. వేసవి సెలవుల నిమిత్తం బేతపూడి నుంచి కాజుగొప్ప బంధువుల ఇంటికి వచ్చింది. తన స్నేహితురాలితో కలిసి రోడ్డుపై నడిచి వెళుతుండగా.. బైక్ పై వచ్చిన ముగ్గురు యువకులు మాంసం నరికే కత్తితో ఆమెపై దాడి చేశారు. 

వెంటనే అప్రమత్తమైన స్థానికులు అక్కడికి చేరుకునేలోపే అంతా జరిగిపోయింది. మెడపై బలమైన గాయం కావడంతో.. ఘటనాస్థలంలోనే మృతి చెందింది. హత్య చేసి పారిపోతుండగా ఆ ముగ్గురిని వెంబడించిన స్థానికులు ఒక వ్యక్తిని పట్టుకుని చితకబాదిన అనంతరం పోలీసులకు అప్పగించారు. 

తీవ్ర గాయాలైన  ఆ యువకుడిని పాలకొల్లు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. దాడి చేసిన  యువకులు హైదరాబాద్‌కు చెందిన వారుగా అనుమానిస్తున్నారు. నరసాపురం డీఎస్పీ సంఘటనా స్ధలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం ప్రేమ వ్యవహారమే ఈ  హత్యకు కారణంగా భావిస్తున్నారు.