రైల్వే ట్రాక్ పై పాటలు వింటుండగా, రైలు ఢీకొని యువకుడి మృతి

రైల్వే ట్రాక్ పై పాటలు వింటుండగా, రైలు ఢీకొని యువకుడి మృతి

young man died walking on railway track : ఒక యువకుడి నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇయర్ ఫోన్లో పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్న యువకుడు హాయిగా పార్కులోనో ఇంట్లోనో వింటే హాయిగా ఉండేది. అదేమి కాకుండా నిర్లక్ష్యంగా రైల్వే ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్ళటంతో రైలు ఢీకొట్టి కన్నుమూశాడు.

గద్వాల మండలం వెంకమ్ పేట కు చెందిన పేచురు రాజు(24) అనే యువకుడు శుక్రవారం సాయంత్రం తన మొబైల్ కు హెడ్ సెట్ పెట్టుకుని పాటలు వింటూ గ్రామ శివారులో రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్నాడు.

అదే సమయంలో గద్వాల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న రైలు డ్రైవర్ పట్టాలపై వ్యక్తిని చూసి గట్టిగా హారన్ మోగించాడు. అయినా చెవిలో ఇయర్ ఫోన్స్ శబ్దంలో రాజుకు రైలు హారన్ వినిపించలేదు. దీంతో రైలు అతడ్ని ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన రాజును స్ధానికులు గమనించి 108లో ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.

రాజు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. తండ్రి సుదర్శనం ఫిర్యాదుమేరకు రైల్వే పోలీసులు కేసునమోదు చేసుకున్నారు.