భద్రత ఏది.. టోల్ ప్లాజా దగ్గర మహిళపై అత్యాచారం

  • Published By: chvmurthy ,Published On : February 19, 2020 / 08:18 AM IST
భద్రత ఏది.. టోల్ ప్లాజా దగ్గర మహిళపై అత్యాచారం

హైదరాబాద్ లో దిశ హత్యాచార ఘటన మరువక ముందే 19ఏళ్ల మహిళపై కర్నాల్ టోల్ ప్లాజా దగ్గర ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. టోల్ ప్లాజా దగ్గరున్న టాయ్ లెట్ కు వెళ్లిన మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన కీచకులు.. తమ మొబైల్ నెంబర్లు కూడా ఇచ్చి మరీ వెళ్లారు. హర్యానాలోని కర్నాల్ జిల్లాలో ఫిబ్రవరి 16, ఆదివారం రాత్రి ఈ దారుణం జరిగింది. 

పంజాబ్ కు చెందిన భార్యాభర్తలు తమ బంధువులను చూడటానికి పానిపట్ కు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి ఆదివారం రాత్రి ప్రయాణమయ్యారు. మార్గ మధ్యంలో తమ సన్నిహితుల నుంచి రూ. 2వేలు తీసుకోవడానికి  రాత్రి 11 గంటల సమయంలో కర్నల్‌ టోల్‌ ప్లాజా దగ్గర ఆగారు. ఈ క్రమంలో మహిళ(19) టాయ్ లెట్ కోసం వెళ్లింది.

స్థానికంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఇది గమనించారు. మహిళను ఫాలో అయ్యారు. మహిళ  టాయిలెట్ లోంచి తిరిగి వస్తుండగా ఆమెను అడ్డగించి కత్తితో బెదిరించి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళారు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం మహిళను అక్కడే వదిలేసి దుండగులు పరారయ్యారు.  పరారవుతూ ఘటన ప్రాంతంలో వారి మొబైల్‌ నెంబర్లను మహిళకు ఇచ్చి వెళ్లారు. ఎలాగోలా అక్కడి నుంచి బయటపడ్డ బాధిత మహిళ భర్త దగ్గరికి వచ్చి.. తనకు జరిగిన ఘోరాన్ని చెప్పుకుని భోరున విలపించింది. 

సోమవారం ఉదయం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలంలో మహిళకు ఇచ్చిన ఫోన్‌ నెంబర్ల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకడు టోల్‌ ప్లాజా సెక్యూరిటీ గార్డు సోనూ కాగా, మరొకడు టోల్ ప్లాజా దగ్గర చిప్స్‌ అమ్ముకునే మేఘరాజ్‌ గా గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు.. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు.