కరువు భత్యం పెంచిన రాష్ట్ర ప్రభుత్వం

కరువు భత్యం పెంచిన రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 3.144 శాతం కరువు భత్యం డీఏను పెంచింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్టారావు బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మూల వేతనంపై కరువ భత్యం 30.392శాతం నుంచి 33.536శాతానికి పెరిగింది. 2019, జనవరి 1నుంచి డీఏ పెంపు వర్తించనుంది. వచ్చే డిసెంబరులో చెల్లించనున్న ప్రస్తుత నవంబరు వేతనంతో కలిపి పెరిగిన కరువు భత్యాన్ని ప్రభుత్వం చెల్లించనుంది. 

డీఏ బకాయిల చెల్లింపు ఇలా: 2019 , జనవరి 1నుంచి 2019, అక్టోబరు 31 మధ్య కాలానికి సంబంధించిన పెరిగిన డీఏ బకాయిలను సంబంధిత ఉద్యోగుల జనరల్ ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. 2020, ఫిబ్రవరి 29కి ముందు పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు సంబంధించిన డీఏ బకాయిలను మాత్రం ప్రభుత్వం నగదు రూపంలో చెల్లిస్తుంది. 2004, సెప్టెంబర్ 1వ తర్వాత నియామకమై కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) వర్తించే ఉద్యోగులకు 2019, జనవరి 1నుంచి 2019, అక్టోబరు 31 మధ్య కాలానికి సంబంధించిన పెరిగిన డీఏ బకాయిల్లో 10శాతాన్ని వారి ప్రాణ్ ఖాతాల్లో ప్రభుత్వ వాటా కలిపి జమ కానుంది. మిగిలిన 90శాతం డీఏ బకాయిలను డిసెంబర్ 2019లో నగదు రూపంలో చెల్లిస్తుంది. జీపీఎఫ్ ఖాతాలకు అనర్హులైన ఫుల్ టైం కాంటిజెంట్ ఉద్యోగుల డీఏ బకాయిలను డిసెంబరులో నగదు రూపంలో చెల్లించనుంది. 

2015, పీఆర్సీ ఉద్యోగులకు: 2015, పీఆర్సీ ప్రకారం వేతనాలు అందుకుంటున్న జడ్పీ, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథఆలయ సంస్థలు, వర్క్ ఛార్జీడ్ ఎస్టాబ్లిష్‌మెంట్, ఎయిడెడ్ సంస్థలు, ఎయిడెడ్ పాలిటెక్నిక్‌ల బోధన, బోధనేతర సిబ్బంది, ప్రొఫెసర్ కే జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జేఎన్జీయూ హెచ్ తో సహా ఇతర వర్సిటీ బోధన, బోధనేతర సిబ్బందికి సైతం కరువు భత్యం 30.392 శాతం 33.536శాతానికి పెంపు వర్తించనుంది. 

2010, పీఆర్సీ ఉద్యోగులకు: జీవో 36ఆధారంగా 2010, పీఆర్సీ వేతనాలు అందుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 112.992శాతం నుంచి 118.128శాతానికి పెరిగింది. అదే విధంగా 2010, పీఆర్సీ ప్రకారం వేతనాలు అందుకుంటున్న జడ్పీ, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు, వర్క్ చార్జీడ్ ఎస్టాబ్లిష్ మెంట్, ఎయిడెడ్ సంస్థుల, ఎయిడెడ్ పాలిటెక్నిక్ బోధన, బోధనేతర సిబ్బంది, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జేఎన్టీహెచ్ తో సహా ఇతర వర్సిటీల బోధన, బోధనేతర సిబ్బందికి సైతం 112.992శాతం నుంచి 118.128 శాతం డీఏ పెంపు వర్తించనుంది. జీవో నెం.171ప్రకారం.. వేతనం రూ.3వేల850 నుంచి రూ.6వేల700 పెరిగిన ఫుల్ టైం కాంటిజెంట్ ఉద్యోగులకు సైతం ఇదే పెంపు వర్తిస్తుంది. 

2006 యూజీసీ వేతనాలపై ఇలా: సవరించిన యూజీసీ వేతనాలు 2006 అందుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 148శాతం నుంచి 154శాతానికి ప్రభుత్వం పెంచింది. సవరించిన యూజీసీ వేతనాలు 2006 అందుకుంటున్న ప్రభుత్వ, ఎయిడెడ్ అనుబంధ డిగ్రీ కళాశాలల బోధన, బోధనేతర సిబ్బంది, ప్రొఫెసర్ కే జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జేఎన్టీయూహెచ్ తో ఇతర వర్సిటీలు, ప్రభుత్వ పాలిటెక్నిక్ ల బోధన సిబ్బందికి ఈ పెంపు వర్తించనుంది.

2016 యూజీసీ వేతనాలపై ఇలా: సవరించిన యూజీవీ వేతనాలు 2016అందుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 9శాతం నుంచి 12శాతానికి ప్రభుత్వం పెంచింది. యూజీసీ వేతనాలు 2016అందుకుంటున్న ప్రభుత్వ, ఎయిడెడ్ అనుబంధ డిగ్రీ కళాశాలల బోధన, బోధనేతర సిబ్బంది, జయశంకర్ వ్యవసాయ వర్సిటీ, జేఎన్టీయూహెచ్ తో పాటు ఇతర వర్సిటీలు, ప్రభుత్వ పాలిటెక్నిక్ ల బోధన సిబ్బందికి ఇది వర్తిస్తుంది. వేతన సవరణ-2010 ప్రకారం.. వేతనాలు పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 112.992శాతం నుంచి 118.128శాతానికి ప్రభుత్వం పెంచింది. పార్ట్ టైం విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లకు నెలకు రూ.100వేతనం పెరిగింది. పెన్షనర్ల డీఏపై గురువారం ఉత్తర్వులిచ్చే అవకాశముంది.