నిరుద్యోగులకు శుభవార్త : హైదరాబాద్లో 41వేల500 ఐటీ జాబ్స్
హైదరాబాద్: నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్లో ఐటీ రంగంలో భారీగా ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. 3 ఏళ్లలో 41వేల 500 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు 2 ప్రముఖ కంపెనీలు ప్రకటించాయి. దేశంలోని ఐటీ రంగంలో అందరినీ దృష్టిని ఆకర్షిస్తూ ప్రపంచంలోని టాప్ 5 ఐటీ కంపెనీలు కొలువు తీరిన హైదరాబాద్ మహా నగరంలో 41వేల 500 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు 2 ప్రముఖ కంపెనీలు ప్రకటించాయి.
ప్రముఖ ఆడిటింగ్ సంస్ధ డెలాయిట్ 3 ఏళ్లో 40వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే హైదరాబాద్లోని ఈ కేంద్రంలో 40వేల మంది పని చేస్తున్నారు. 3 ఏళ్లలో ఉద్యోగులను రెట్టింపు చేయనున్నట్లు డెలాయిట్ ఇండియా టెక్నాలజీకి చెందిన మీడియా, టెలికాం లీడర్ హేమంత్ జోషి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా డెలాయిట్కు సంబంధించిన కీలక ఆవిష్కరణలు కొన్ని హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నాయని ఆయన అన్నారు. ట్యాక్సేషన్, మొబిలిటీ, ఐటీ సిస్టమ్స్, మెర్జర్స్ ఆక్విజిషన్స్, కన్సల్టింగ్ సర్వీసెస్, ఫైనాన్స్ ఫంక్షన్స్, సిస్టం ఇంటిగ్రేషన్ తదితర కార్యకలాపాలకు సంబంధించి ఈ నియామకాలు చేపట్టనున్నట్టు డెలాయిట్ గ్లోబల్ టెక్ మీడియా లీడర్ పాల్ సలోమి తెలిపారు. డెలాయిట్కు బెంగళూరు, ముంబై, ఢిల్లీలో కార్యాలయాలు ఉన్నప్పటికీ హైదరాబాద్లోనే తమ సంస్ద విస్తరణకు ప్రణాళికలు రూపొందిచంటం పట్ల అంతర్జాతీయ కంపెనీలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని ఐటీ నిపుణులు భావిస్తున్నారు.
ఇంటెల్లో 1500 ఉద్యోగాలు:
ప్రపంచంలోనే అతిపెద్ద చిప్మేకర్ కంపెనీ ఇంటెల్ తన హైదరాబాద్ కేంద్రంలో ఈ ఏడాది 15వందల మంది కొత్త ఉద్యోగులను తీసుకునేందుకు సిద్ధమవుతునట్లు తెలిపింది. భారతీయ మార్కెట్ అవసరాలను నెరవేర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్లో ఇటీవలే ఇంజినీరింగ్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసిన సంస్థ రాబోయే ఏడాది కాలంలో 15వందల కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నదని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో తెలిపింది.
ప్రస్తుతం ఈ సెంటర్లో 500మంది పనిచేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఐటీశాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ అమెరికా పర్యటనలో ఇంటెల్ ప్రతినిధులను కలిసి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని జరిపిన చర్చల ఫలితంగా, 2018లో హైదరాబాద్లో ఇంజినీరింగ్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ను ఇంటెల్ ఏర్పాటుచేసింది. త్వరలో 3 లక్షల చదరపు అడుగుల స్థలం తీసుకొని కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు ప్రణాళికలు రచించినట్టు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.