Microsoft : ఏపిలో నైపుణ్య శిక్షణకు మైక్రోసాఫ్ట్… శిక్షణ పొందనున్న 1.62లక్షల విద్యార్ధులు

పరిశ్రమలకు అవసరమైన సర్టిఫికేషన్‌ కోర్సులు ముఖ్యంగా ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సైన్స్, కంప్యూటర్‌ సైన్స్‌ తదితర విభాగాల్లో మైక్రోసాఫ్ట్‌ శిక్షణ ఇస్తుంది. అజూర్‌ ల్యాబ్స్‌ ద్వారా విద్యార్ధులకు యాప్‌ల అభివృద్ధి, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, బిగ్‌డేటా లాంటి 25 ఫ్రీ అజూర్‌ సర్వీసులు అందుతాయి.

Microsoft : ఏపిలో నైపుణ్య శిక్షణకు మైక్రోసాఫ్ట్… శిక్షణ పొందనున్న 1.62లక్షల విద్యార్ధులు

Skills

Microsoft : విద్యార్ధుల్లో నైపుణ్యాన్ని పెంచి భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేలా ఏపి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో అడుగులు వేస్తోంది. ముఖ్యంగా డిగ్రీస్ధాయిలో ఉండే విద్యార్ధులపై ప్రధానంగా దృష్టిసారిస్తూ వారిలో నైపుణ్యాన్ని పెపొందించేందుకు ప్రపంచ అగ్రశ్రేణి సంస్ధ మైక్రోసాఫ్ట్ తో శిక్షణ ఇప్పించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆ సంస్ధతో ఏపి సర్కారు ఒప్పందం చేసుకోగా, కరోనా కారణంగా విద్యాసంస్ధలు మూతపడటంతో అది అమలు సాధ్యకాలేదు. అయితే ఒప్పంద గడువును వచ్చే ఏడాది డిసెంబరు వరకు పొడగిస్తూ తాజా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఏపి సియం జగన్ మోహన రెడ్డి అదేశాల నేపధ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి ప్రత్యేక చొరవతో మైక్రోసాఫ్ట్ సంస్ధ విద్యార్ధులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.

రాష్ట్రంలో 1.62 లక్షల మంది విద్యార్థులకు సాఫ్ట్‌ స్కిల్స్‌ నైపుణ్యాలపై శిక్షణను ఈ సంస్ధ ఇవ్వనుంది. 300 కాలేజీల పరిధిలో చదువుతున్న విద్యార్ధులు, నిరుద్యోగ యువతకు మైక్రోసాఫ్ట్‌ వివిధ కోర్సులలో ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. శిక్షణకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.30.79 కోట్లను ఖర్చుచేయనుంది. మైక్రోసాఫ్ట్‌ సంస్థ అధునాతన సాఫ్ట్‌వేర్‌ అంశాలను ఈ శిక్షణలో విద్యార్ధులకు బోధించనుంది. ప్రత్యేక డొమైన్‌ ద్వారా 40 సర్టిఫికేషన్‌ కోర్సులలో విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది.

సర్టిఫికేషన్‌ కోర్సులతో పాటు అదనంగా లింకిడ్‌ ఇన్‌ లెర్నింగ్‌ ద్వారా బిజినెస్, క్రియేటివిటీ, టెక్నికల్‌ విభాగాలకు సంబంధించిన 8,600 కోర్సులు విద్యార్ధులు నేర్చుకునేందుకు అందుబాటులోకి వస్తాయి. మైక్రోసాఫ్ట్‌ సంస్థ రూ.7,500 (100 యూఎస్‌ డాలర్లు) విలువ గల అజూర్‌పాస్‌ ను ప్రతి విద్యార్థికి సమకూర్చనుంది. క్లౌడ్‌ టెక్నాలజీ ద్వారా శిక్షణాంశాలను సులభంగా పొందగలుగుతారు.

పరిశ్రమలకు అవసరమైన సర్టిఫికేషన్‌ కోర్సులు ముఖ్యంగా ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సైన్స్, కంప్యూటర్‌ సైన్స్‌ తదితర విభాగాల్లో మైక్రోసాఫ్ట్‌ శిక్షణ ఇస్తుంది. అజూర్‌ ల్యాబ్స్‌ ద్వారా విద్యార్ధులకు యాప్‌ల అభివృద్ధి, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, బిగ్‌డేటా లాంటి 25 ఫ్రీ అజూర్‌ సర్వీసులు అందుతాయి. సెల్ఫ్‌పేస్‌డ్, డిజిటల్‌ లెర్నింగ్‌ వనరుల ద్వారా విద్యార్ధులు నూతన సాంకేతిక అంశాలపై శిక్షణ పొందుతారు.మైక్రోసాఫ్ట్‌ ద్వారా సర్టిఫికేషన్‌ కోర్సుల ప్రాజెక్టు అమలు, పురోగతి పరిశీలనకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. విద్యాశాఖ మంత్రి ఛైర్మన్‌గా, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి సభ్యుడిగా, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కన్వీనర్‌గా మరో నలుగురితో కమిటీ ఏర్పాటైంది.

మైక్రోసాఫ్ట్‌ శిక్షణతో పలు రకాలుగా మేలు జరుగుతుందని విద్యారంగ నిపుణులు పేర్కొన్నారు. అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో నిర్వహించిన సమావేశానికి మైక్రోసాఫ్ట్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ ఓమ్‌జివాన్‌ గుప్తా తదితరులు హాజరై ప్రతిపాదనలను వివరించారు. అకడమిక్‌ ప్రోగ్రామ్స్‌లో మైక్రోసాఫ్ట్‌ శిక్షణ కార్యక్రమాలను చేర్చడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని, సర్టిఫికేషన్‌ కోర్సులతో ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని వీసీలు పేర్కొన్నారు.

ఆన్‌లైన్‌ విధానంలో ఈ శిక్షణకార్యక్రమం కొనసాగనుంది. అత్యంత నాణ్యమైన కొత్త కరిక్యులమ్‌ ద్వారా మైక్రోసాఫ్ట్‌ శిక్షణ ఇస్తుంది. బ్రాండ్‌ వాల్యూ ఉన్న మైక్రోసాఫ్ట్‌ అందించే ఈ కోర్సులకు ప్రపంచవ్యాప్తంగా కంపెనీల గుర్తింపు ఉన్నందున విద్యార్ధులకు ఎంతో మేలు జరగనుంది. శిక్షణలో భాగంగా మైక్రోసాఫ్ట్‌ గుర్తించిన సంస్థల ద్వారా మాక్‌ టెస్టులు, పరీక్షలు ఇతర కార్యక్రమాలు చేపడతారు. విద్యార్ధులకు మైక్రోసాఫ్ట్‌ అందించే సర్టిఫికెట్లను డిజి లాకర్‌లో భద్రపరుస్తారు.