దేశంలో 7 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ
దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర ప్రభుత్వం శాఖల్లో 7 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది మార్చి 1 నాటికి మొత్తం ఆరు లక్షల 83వేల 823 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాచారంలో తెలిపారు. మంత్రి రాజ్యసభకు అందించిన డేటా ప్రకారం గ్రూప్ సీ లో మొత్తం 5,74,289, గ్రూప్ బీ లో 89,638 గ్రూప్ ఏ విభాగంలో 19,896 ఉద్యోగాలు భర్తీ కావల్సి వుందని వివరించారు. షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు) ఇతర వెనుకబడిన తరగతులకు (ఓబిసి) బ్యాక్ లాగ్ రిజర్వు పోస్టుల్లో కూడా ఖాళీలు ఉన్నాయని మరో సమాధానంలో మంత్రి చెప్పారు.
గ్రూప్ సీ, లెవల్ -1లో లక్షా 56వేల138 ఖాళీలను భర్తీ చేసే మరో ఐదు సీఈ నోటిఫికేషన్లను కూడా 2018-19లో జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఎస్ఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సినవి కాకుండా 19,522 ఖాళీలను వివిధ గ్రేడ్లలో భర్తీ చేయాలని నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. మొత్తంగా ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, సీఈఎన్ల ద్వారా ఖాళీలను భర్తీ చేసే నియామక ప్రక్రియ పురోగతిలో ఉందని సింగ్ తెలిపారు. అలాగే జనవరి 1, 2019 నాటికి ఎస్సీలకు 1,713 (ఎస్సీ)బ్యాక్లాగ్ ఖాళీలు, ఎస్టీలకు 2,530 బ్యాక్లాగ్ ఖాళీలు, ఓబీసీలకు 1,773 బ్యాక్లాగ్ ఖాళీలు భర్తీ కాలేదని మంత్రి తెలిపారు
త్వరితగతిన ఉద్యోగాల భర్తీకి వీలుగా.. నియామక ప్రక్రియ సమయాన్ని తగ్గించడానికి నాన్ గెజిటెడ్ ఉద్యోగార్థులకు ఆన్లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించామని, ఈ ప్రక్రియ జనవరి 1, 2016 వరకు కొనసాగిందని తెలిపారు. ఉద్యోగార్థుల సర్టిఫికెట్ల పరిశీలన, ప్రొవిజనల్ నియామక పత్రాల జారీ లాంటి అంశాలు పెండింగులో ఉన్నట్టు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
వివిధ కేంద్ర పభుత్వ విభాగాలు అందించిన సమాచారం మేరకు 2019-20 సంవత్సరానికి గాను 1,05,338 పోస్టుల భర్తీ ప్రక్రియను ఎస్.ఎస్.సీ (స్టాఫ్ సెలెక్షన్ కమిషన్) ద్వారా ప్రారంభించామన్నారు. 2017-18లో గ్రూప్ సీ లెవల్ 1 పోస్టుల 1,27,573 పోస్టుల భర్తీ కోసం సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్స్ (సీఈఎన్) కింద రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) ద్వారా 1,27,573 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. కాగా.. ఈ రెండేళ్లలో మరిన్ని ఖాళీలు ఏర్పడ్డాయన్నారు.