ప్రేయసికి జరిగిన అవమానానికి ప్రియుడి ప్రతీకారం: 500ల మంది మెడికోల ల్యాప్‌టాప్‌లు చోరీ చేసి..

ప్రేయసికి జరిగిన అవమానానికి ప్రియుడి ప్రతీకారం: 500ల మంది మెడికోల ల్యాప్‌టాప్‌లు చోరీ చేసి..

Tamilnadu lover revenge:  ప్రేమించలేని అమ్మాయిలపై దాడులకు పాల్పడుతున్న ఈరోజుల్లో ఓ ప్రియుడు ఏకంగా ప్రియురాలి కోసం పగతీర్చుకున్నాడు. సినిమాలో క్రైమ్ థ్రిల్లర్ మూవీని తలపించే ఈ ప్రియుడి ప్రతీకారం గురించి తెలుసుకున్న పోలీసులే షాక్ అయిన ఘటన తమిళనాడులో జరిగింది. తన ప్రియురాలిని అవమానించారని..ఆమెను మానసిక వేదనకు గురిచేశారని ప్రతీకారం తీర్చుకున్న వైనం బైటపడింది..ఐదు సంవత్సరాల క్రితం తన ప్రేయసికి జరిగిన అవమానానికి తన తెలివితేటల్ని ఉపయోగించి వినూత్న రీతిలో రీతిలో ప్రతీకారం తీర్చుకున్నాడు ఓ యువకుడు.

తమిళనాడుకు చెందిన 24 ఏళ్ల తమిళసెల్వన్‌ కన్నన్‌ ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమెకు చిన్న కష్టం వచ్చినా భరించలేకపోయేవాడు. ఆమెకు ఓ మెడికల్ విద్యార్ధినితో స్నేహం ఉండేది. కన్నన్ ప్రేయసికి ఆమె స్నేహితురాలికి మధ్య ఏం జరిగిందో తెలీదుగానీ ఇద్దరి మధ్యా విభేదాలు వచ్చాయి. దీంతో కొంతమంది మెడికల్ విద్యార్ధులు కన్నన్ ప్రేయసిపై పగబట్టారు. ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి..వాటితో అసభ్యంగా ఓ వీడియో తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టారు. తీవ్రమైన వేధింపులకు గురిచేసారు.

ఆ వీడియో చూసిన కన్నన్ ప్రేయసి విపరీతంగా కృంగిపోయింది. తీవ్ర మానసిక వేధనకు గురైంది. అది తెలిసి తమిళసెల్వన్ కన్నన్ తన ప్రేయసిన వేధించినవారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు.

అలా 2015లో తన ప్రేయసిని అసభ్యకరంగా ఫోటోలు..వీడియోలు తీసి సైబర్‌ వేధింపులకు గురి చేసిన ఆమె స్నేహితురాలితో సహా మెడికల్ విద్యార్ధులందరిపైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగాడు. దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ విద్యార్ధుల ల్యాప్‌టాప్‌లను టార్గెట్‌ చేశాడు. వాటిని చోరీ చేయటం మొదలుపెట్టాడు. గుజరాత్‌లోని జామ్‌నగర్ పోలీసులు ఓ ల్యాప్‌టాప్ దొంగను అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా, ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చోరీ గురించి సదరు నిందితుడు చెబుతున్న విషయాలు విన్న పోలీసులు నోరెళ్లబెట్టారు.

అలా కన్నన్ ఇప్పటివరకు 500 మంది మెడికోల ల్యాప్‌టాప్‌లు దొంగిలించానని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. చోరీలకు పాల్పడేందుకు నిందితుడు ఇంటర్నెట్‌లో మెడికల్‌ కాలేజీల సమాచారం సేకరించి..ఆ తరువాత రెక్కీ నిర్వహించి మరీ చోరీలకు పాల్పడేవాడని పోలీసుల విచారణలో తేలింది.

తాను చోరి చేసిన ల్యాప్‌టాప్‌లు ఎక్కువ శాతం దక్షిణ భారత దేశంలోని మెడికల్‌ కాలేజీలకు చెందిన స్టూడెంట్స్ వేనని కన్నన్ తెలిపాడు. కన్నన్ లాస్ట్ టైమ్ 2020 డిసెంబర్‌లో జామ్ నగర్‌లోని ఎంపి షా మెడికల్ కాలేజీ బాలికల హాస్టల్ నుంచి ఐదు ల్యాప్‌టాప్‌లు దొంగిలించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. అలా గత ఐదేళ్లుగా కేవలం మెడికల్ స్టూడెంట్స్ ల్యాప్ టాప్ లనే చోరీ చేస్తున్నాడని తెలిపారు. దీంతో ఆ సీరియల్ ల్యాప్ టాప్ దొంగను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.