Home » చైనాలో మొదలైన కరోనా వైరస్తో పోలిస్తే కర్నూలు వైరస్లో మార్పులు.. ఏపీ నుంచి తొలి అధ్యయనం
Published
5 months agoon
By
vamsiచైనాలోని వూహాన్లో మొదలై ప్రపంచ మానవాళికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారిపై అధ్యయనాలు సాగుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. లేటెస్ట్గా కరోనా వైరస్పై కర్నూలు మెడికల్ కాలేజీ (కేఎంసీ) మైక్రో బయాలజీ విభాగంలో బయో ఇన్ఫర్మాటిక్ అధ్యయనం జరిగింది.
కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) పరిధిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ) కర్నూలు ప్రాంతం నుంచి 90 మంది కరోనా బాధితుల శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్(ఎన్జీఎస్) చేశారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలను కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.చంద్రశేఖర్తో కలిసి మైక్రోబయాలజీ స్పెషలిస్టు డాక్టర్ పి.రోజారాణి విలేకరులకు వివరించారు. ఈ అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
చైనాలోని వూహాన్లో మొదలైన కరోనా వైరస్తో పోలిస్తే కర్నూలులో కనిపిస్తున్న వైరస్లో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. కర్నూలు ప్రాంతంలో సేకరించిన 90 శాంపిల్స్ పరిశీలించగా.. ఇందులో 88% మందిలో ఏ2ఏ అనే జన్యువు రూపంలో 12% మందిలో ఎల్/ఏ3ఎల్ అనే రూపంలో ఉన్నట్లు కనుగొన్నారు.
ఈ అధ్యయనాలకు సంబంధించిన నివేదికలను ఐజీఐబీ సీనియర్ సైంటిస్ట్ వినోద్ స్కారియాకు పంపారు. ఇలాంటి అధ్యయనం వల్ల కోవిడ్–19 ఎలా మార్పులు చెందుతోంది, దానికి ఎలాంటి వ్యాక్సిన్ తయారు చేయాలి, వైరస్ను గుర్తించేందుకు ఎలాంటి ప్రోబ్స్ కావాలి వంటివి తెలుసుకోవచ్చు. ఈ అధ్యయనానికి మైక్రోబయాలజీ హెచ్వోడీ డాక్టర్ సురేఖ, డాక్టర్ విజయలక్ష్మి సహకరించారు. జాతీయ స్థాయిలో ఆరు ప్రతిష్టాత్మక సంస్థలు ఈ అధ్యయనంలో పాల్గొన్నాయి. ఏపీ నుంచి మొదటి అధ్యయనం ఇదే కావడం విశేషం.