Home » కుళ్లిన మాంసం, పాచిన హల్వా.. విశాఖ, విజయవాడలో హోటల్స్, రెస్టారెంట్లలో దారుణాలు
Published
3 months agoon
By
naveenRaids On Hotels And Restaurants: విశాఖలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేపట్టారు. నగరంలోని పలు హోటల్స్, రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు చేసిన అధికారులు.. నిల్వ చేసిన, కలుషిత ఆహార పదార్ధాల విక్రయాలపై సోదాలు జరిపారు. అనంతరం పలు హోటల్స్, రెస్టారెంట్లలో ఆహార పదార్థాల శాంపిల్స్ను సేకరించి.. ల్యాబ్కు పంపిస్తున్నారు.
కుళ్లిన మటన్ తో వంటకాలు:
రెండ్రోజుల క్రితం విజయవాడలోనూ ఇలాంటి మోసాలే వెలుగు చూశాయి. బార్బీ క్యూ నేషన్ రెస్టారెంట్పై ఫుడ్ సేఫ్టీ, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అధికారులే నివ్వరపోయే విషయాలు వెలుగు చూశాయి. కుళ్లిన మటన్ను రెస్టారెంట్ నిర్వాహకులు ఆహార పదార్ధాల కోసం వినియోగిస్తున్న వైనం బయటపడింది. వారం రోజులపాటు నిల్వ ఉంచిన మటన్తోనే ఆహార పదార్ధాలను తయారు చేసి.. వాటిని కస్టమర్స్కు వడ్డిస్తున్నట్టు అధికారులు గుర్తించారు.
ఆహార పదార్థాల్లో నిషిద్ధ రంగులు:
అంతేకాదు… ఆహార పదార్థాల్లో నిషిద్ధ రంగులను వినియోగిస్తున్నట్టుగా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఇక పాడైపోయిన హల్వాను సరఫరా చేస్తున్నట్టు అధికారుల తనిఖీల్లో తేలింది. దీంతో ఆహార పదార్థాల నమూనాలను అధికారులు సేకరించారు. వాటిని టెస్ట్ కోసం ల్యాబ్కు తరలించారు. ల్యాబ్ రిపోర్ట్ అధారంగా రెస్టారెంట్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
రెస్టారెంట్ లోని వంట గది, స్టోర్ రూంలను పరిశీలించగా, అక్కడ సీన్ చూసి వారికి దిమ్మ తిరిగింది. ఫ్రిజ్లో నిల్వ ఉంచిన మటన్ గడ్డ కట్టుకుపోయి కుళ్లిపోయే స్థితిలో ఉంది. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, హానికర రసాయనాల చూసి అవాక్కయ్యారు. అంతేకాదు వండిన అన్నాన్ని సైతం ఫ్రిజ్లోనే ఉంచారు. 20 హల్వా ప్యాకెట్లపై ఫంగస్ ఉండడాన్ని గుర్తించారు. అనుమతి లేకుండా కుల్ఫీ ఐస్క్రీం, బేకరీ ఉత్పత్తులను తయారు చేస్తున్నారని తేల్చారు. బిర్యానీ తయారీలో సింథటిక్ రంగులను వినియోగిస్తున్నారనే అనుమానంతో నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్కు పంపారు. అలాగే కొవిడ్-19 నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో టేబుల్పై 8 నుంచి 10 మందిని కూర్చోబెట్టారు. సిబ్బందికి సంబంధించి ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు లేవు.. ఎక్కడా శానిటైజేషన్ చేయడం లేదు.
ఇలా అడుగడుగునా నిబంధనలను ఉల్లంఘిస్తూ వినియోగదారుల ఆకలిని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఆ కుళ్లిన మటన్, పాచిన హల్వా, అపరిశుభ్రంగా ఉన్న బిర్యానీ తింటే జనాల ఆరోగ్యం సంగతి ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.