పార్శిల్స్, లెటర్ల నుంచి కరోనా వైరస్.. రాజకీయ నేతలే టార్గెట్.. ఇంటర్‌పోల్ వార్నింగ్

  • Published By: sreehari ,Published On : November 22, 2020 / 08:32 AM IST
పార్శిల్స్, లెటర్ల నుంచి కరోనా వైరస్.. రాజకీయ నేతలే టార్గెట్.. ఇంటర్‌పోల్ వార్నింగ్

Covid Contaminated Letters : కరోనా వ్యాప్తిపై అంతర్జాతీయ నేర పోలీసు సంస్థ ఇంటర్‌పోల్ హెచ్చరిక జారీ చేసింది. పార్శిల్స్, లెటర్ల నుంచి కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇంటర్ పోల్ హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చట్ట అమలు సంస్థలను హెచ్చరించింది.



ప్రముఖులు, రాజకీయ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని Covid-19 వ్యాప్తి చేసే ప్రమాదం ఉందని ఇంటర్ పోల్ అలర్ట్ చేసింది. ప్రత్యేకించి పార్శిల్స్, వైరస్ అంటించిన లెటర్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.



తాజా మార్గదర్శకాల ప్రకారం.. ఇంటర్ పోల్.. భారతదేశంతో సహా అన్ని చట్ట అమలు సంస్థలను పర్యవేక్షణను మరింత పటిష్టం చేసేలా సంబంధిత సంస్థలను హెచ్చరించాలని సూచించింది.

కొంతమంది దుర్మార్గులు ఉద్దేశపూర్వకంగానే పోలీసులపై, నిఘా అధికారులు, భద్రతా అధికారులు, డాక్టర్లకు దగ్గరగా వెళ్లి వారిపై తుంపర్లు పడేలా తుమ్మడం, దగ్గడం చేస్తున్నారు. అలాగే కరోనా వైరస్ కలుషితమైన లేఖలు, పార్శిల్స్ ను రాజకీయ వ్యక్తులకు పంపించే కుట్రలు పన్నుతున్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది.



వెంటనే అలర్ట్ అయిన ఇంటర్ పోల్ 194 సభ్యదేశాలకు సూచనలు ఇస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఉపరితలాలు, వస్తువులపై ఉమ్మివేయడం, దగ్గు చేయడం ద్వారా ఉద్దేశపూర్వకంగా కరోనా వైరస్ వ్యాప్తి అయ్యేలా కుట్రలు చేస్తున్నారంటూ నిఘా నివేదికలు వెల్లడించాయి.



వైరస్‌తో కలుషితమైన శాంపిల్స్ ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. వ్యక్తిగత రక్షణ, క్లీనింగ్ ఉత్పత్తుల కోసం మార్కెట్లో భారీ డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలో నేరగాళ్లు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో COVID-19 మహమ్మారి వ్యాప్తికి కారణమవుతోంది.

మార్చి 2020 నుంచి భాగస్వాములతో కలిసి ఇంటర్‌పోల్ ఆపరేషన్ పాంగీయా నిర్వహించింది. ఇందులో నకిలీ సర్జరీ మాస్క్‌లు, హ్యాండ్ శానిటైజర్లు, యాంటీవైరల్, యాంటీమలేరియల్ మందులు, టీకాలు, కోవిడ్ -19 టెస్ట్ కిట్లు ఉన్నాయని ఇంటర్ పోల్ మార్గదర్శకాల్లో పేర్కొంది.



అనుమానిత పార్శిల్స్, లేటర్లను జాగ్రత్తగా చెకింగ్ చేయాలని ఇంటర్ పోల్ పలు సూచనలు చేసింది. ఇలాంటి వాటిపై రాజకీయ ప్రముఖులకు భద్రతతో పాటు అవగాహన కలిగి ఉండాలని ఇంటర్ పోల్ పలు సూచనలు చేసింది.