గాల్లో తేమను కంట్రోల్ చేస్తేనే.. కరోనా కట్టడి చేయగలం!
కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది.. కరోనాకు ఇప్పటివరకూ ఎలాంటి మందులేదు.. అసలు కరోనా ఎలా వ్యాపిస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి.. కరోనా ఏయే మార్గాల్లో వ్యాపిస్తుందో గుర్తించలేకపోతున్నారు.. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న ఆయుధాలు రెండే.. సామాజిక దూరం.. ఫేస్ మాస్క్.. ఈ రెండింటి ద్వారానే దాదాపు కరోనా వ్యాప్తిని నియంత్రంచడం సాధ్యపడుతుంది.
ఇప్పుడు గాల్లో కూడా కరోనా వ్యాపిస్తుందని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.. గాల్లో తేమ తక్కువగా ఉన్న ప్రదేశాల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉంటుందని కనుగొన్నారు.. గాల్లో తేమను కంట్రోల్ చేసినప్పుడే కరోనా వ్యాప్తికని నియంత్రించగలమని భారత్, జర్మనీ సైంటిస్టులు సూచిస్తున్నారు.
ఆస్పత్రులు, ఆఫీసులు, బస్సులు, రైళ్లు వంటి రవాణా వ్యవస్థల్లో గాల్లోని తేమ శాతాన్ని 40 నుంచి 60 శాతానికి నియంత్రించడం ద్వారా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయగలమని వీరి అధ్యయనంలో తేలింది. CSIRకు చెందిన నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ, జర్మనీలోని లిబ్నిజ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రోపోస్ఫియర్ రీసెర్చ్లు అధ్యయనాన్ని నిర్వహించాయి. గాల్లోని తేమశాతం 5 మైక్రోమీటర్ల కంటే తక్కువ సైజు ఉన్న నోటి తుంపర్లలోని సూక్ష్మజీవులపై ప్రభావం చూపుతుందని గుర్తించారు.
అంతేకాదు.. ఉపరితలాలపై వైరస్ ఎక్కువ సమయం ఉంటుందని కూడా అధ్యయనంలో తేలింది. గాల్లోని తేమ 40 శాతం కంటే తక్కువ ఉంటే కరోనా సోకే అవకాశాలు ఎక్కువని పేర్కొంది. కోవిడ్ బారిన పడ్డ వారి నోట్లో తుంపర్లలోని కణాలు తక్కువ నీటి కణాలను ఆకర్షిస్తాయని గుర్తించారు.. ఫలితంగా వైరస్ కణాలు తేలికగా ఉండి.. ఎక్కువ దూరం ప్రయాణిస్తాయని అంటున్నారు.
ఇతరులకు సోకే అవకాశమూ ఎక్కువ అవుతుందని లిబ్నిజ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రోపోస్ఫియర్ రీసెర్చ్ శాస్త్రవేత్త అజిత్ వివరించారు. గాల్లో తేమ తక్కువగా ఉంటే ముక్కు లోపలి పొరలు కూడా పొడిగా మారతాయని అంటున్నారు.. వైరస్ ఎక్కువగా వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
గాల్లో తేమశాతం ఎక్కువగా ఉంటే నోటి తుంపర్లు వేగంగా బరువెక్కి నేలకు రాలిపోతాయని చెబుతున్నారు.. సాధ్యమైనంతవరకు గాల్లో తేమ ఉండేలా చూడాలని అప్పుడే కరోనా వ్యాప్తిని కట్టడి చేయడం సాధ్యపడుతుందని పరిశోధకులు సూచిస్తున్నారు.